'వికసిత్ భారత్' సాధించడమే లక్ష్యం

by Ajay Maddhiboyina |

'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్'అన్న గురజాడ అప్పారావు సూక్తితో మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

- సున్నా పేదరికం వైపుగా భారత్

- మన సంస్కరణలపై ప్రపంచం దృష్టి

- గిగ్ వర్కర్లకు ఆరోగ్య భీమా

- వేతన జీవులకు ఊరట

- బీహార్‌పై వరాల జల్లు

- కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

దిశ, నేషనల్ బ్యూరో:

కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి తీసుకొని లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్'అన్న గురజాడ అప్పారావు సూక్తితో మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'వికసిత్ భారత్' లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నామని.. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. మధ్య తరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా రాబోయే ఐదేళ్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రపంచమంతా మన సంస్కరణలపై దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ సారి బడ్జెట్‌ను సున్నా పేదరికమే లక్ష్యంగా.. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేలా చూశామన్నారు. వికసిత భారత్‌లో జీరో పేదరికం ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన ద్వారా దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామన్నారు. గోదాముల నిర్మాణం, నీటిపారుదల వ్యవస్థ ఆధునికీకరణ, రుణ సౌకర్యాల కల్పన ద్వారా 1.7 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అలాగే కిసాన్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని, దీని ద్వారా 7.7 కోట్ల మంది రైతులకు కొత్తగా ప్రయోజనం కలుగుతుందన్నారు. బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు బీహార్‌కు మరి కొన్ని వరాలు కూడా ప్రకటించారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును బీహార్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీహార్‌కు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత దక్కింది. ఇక గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్న వారికి పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించనున్నారు. దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు లబ్ది చేకూరనుంది. ఉడాన్ పథకం ద్వారా కొత్తగా 120 రూట్లలో విమాన ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ ప్రకటించారు. మెడికల్ టూరిజానికి ప్రోత్సాహకంగా వీసా నిబంధనలు మరింత సులభతరం చేయనున్నారు. ఐఐటీ, ఐఐఎస్‌ విద్యార్థులకు రూ.10 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. దీంతో పాటు రూ.12 లక్షల వరకు సున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ తీసుకొని రానున్నారు. ఇది వేతన జీవులకు భారీ ఊరట.

Next Story