Modi: నాపక్కనే శశిథరూర్.. చాలా మంది నిద్రాభంగం కలిగించబోతోంది.. ప్రతిపక్షాలపై మోడీ విసుర్లు

by Shamantha N |

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పించారు.

Modi: నాపక్కనే శశిథరూర్.. చాలా మంది నిద్రాభంగం కలిగించబోతోంది.. ప్రతిపక్షాలపై మోడీ విసుర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పించారు. తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన విజినజమ్ ఇంటర్నేషనల్‌ డీప్‌వాటర్‌ మల్టీపర్పస్‌ సీపోర్టును ప్రధాని (PM Modi) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) హాజరయ్యారు. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. కాంగ్రెస్ ను విమర్శించారు. ‘‘ ఇండియా కూటమికి బలమైన స్తంభం శశిథరూర్ ఇక్కడ కూర్చున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కి ఈ విషయాన్నే నేను చెప్పాలనుకుంటున్నా. ఈ కార్యక్రమం చాలా మంది నిద్రకు భంగం కలిగించబోతోంది " అని మోడీ చిరునవ్వులు చిందిస్తూ అన్నారు.

మోడీకి స్వాగతం పలికిన థరూర్

కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని థరూర్‌ వ్యక్తిగతంగా వెళ్లి స్వాగతించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా. నా నియోజకవర్గానికి వచ్చిన మోడీని సాదరంగా స్వాగతించా’’ అని థరూర్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. మరోవైపు, కాంగ్రెస్ అధిష్ఠానానికి శశిథరూర్ మధ్య చెడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సొంతపార్టీపైనే థరూర్ గత కొంతకాలంగా విమర్శలుగుప్పిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారతదేశ వైఖరి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో దౌత్య చర్చలను నడిపించడం వంటి అనేక అంశాలపై నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని థరూర్ గతంలో ప్రశంసించారు. ఈ క్రమంలోనే ఆ మధ్య ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్‌ పార్టీ మారనున్నట్లు ప్రచారం మొదలైంది. ఇక, భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ పరిణామాల వేళ ఆయన మోడీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది.

Next Story