- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు: పోలింగ్కు సర్వం సిద్ధం చేసిన ఈసీ
కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.

దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ రేపుతున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రేపు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని కేటాయించారు.
పోలింగ్ వేళ పటిష్ట భద్రత..
ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండనుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, సుమారు 6 కోట్లకు పైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ఇక రాష్ట్రాల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను పరిశీలిస్తే.. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు గానూ 30,471 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 31,486 పోలింగ్ కేంద్రాలను, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 1,009 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలతో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ మూడు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు కూడా మే 4, 2026న వెలువడనున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్-యూడీఎఫ్ మధ్య, అస్సాంలో ఎన్డీఏ-మహజోత్ కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.






