అఖిలేష్ యాద‌వ్‌తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ..

by Disha Web Desk 13 |
అఖిలేష్ యాద‌వ్‌తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ..
X

ల‌క్నో: ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెరవేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విప‌క్షాల మ‌ద్దతును కూడగట్టే పనిలో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బుధ‌వారం మధ్యాహ్నం ఉత్తర ప్రదేశ్‌లోని ల‌క్నోలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్‌ తో భేటీ అయ్యారు. కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో క‌లిసి రావాల‌ని అఖిలేష్‌ను కోరారు. ఈ సంద‌ర్బంగా కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్, ఎంపీ సంజ‌య్ సింగ్, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్, అఖిలేష్ యాద‌వ్ మ‌ధ్య గంట‌కు పైగా స‌మావేశం జ‌రిగింది. దేశంలో చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాల గురించి వారు చ‌ర్చించారు.

సిసోడియాను తలచుకుని కేజ్రీవాల్ కంటతడి..

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను తలచుకుని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలోని బవానాలో బీఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌లెన్స్ నూతన శాఖను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా రంగం అభివృద్ధి కోసం సిసోడియా చేసిన పనులను కేజ్రీవాల్ గుర్తుచేసుకున్నారు. తప్పుడు కేసులో సిసోడియాను జైల్లో పెట్టారని ఆరోపించారు.

ఎంపీ గూండాలతో వెళ్లి పోలీసులను కొట్టినా యోగికి కనిపించట్లేదు : అఖిలేష్

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్‌ బుధవారం ఉదయం మీడియా సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమ‌ర్శలు గుప్పించారు. కాషాయ పాల‌న‌లో రాష్ట్రంలో శాంతిభ‌ద్రత‌లు గాడిత‌ప్పాయ‌ని మండిప‌డ్డారు. కన్హౌజ్‌లో ఓ ఎంపీ గూండాలతో వెళ్లి ఔట్‌పోస్టులో ఉన్న పోలీసులందరినీ కొట్టినా యోగి స‌ర్కార్ ప్రేక్షక పాత్రకు ప‌రిమిత‌మైంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. ఈ పని మరెవరో చేసి ఉంటే, యోగి ప్రభుత్వం బుల్డోజర్లతో నేర‌గాళ్ల ఇండ్లను నేల‌మ‌ట్టం చేసేద‌ని అన్నారు. న్యాయం చేయాలంటూ ఢిల్లీలో మ‌హిళా రెజ్లర్లు గొంతెత్తి అలసిపోయార‌ని, వారు నిర‌స‌న‌ల‌తో గ‌ళ‌మెత్తినా మోదీ స‌ర్కార్ నోరు మెద‌ప‌డం లేద‌ని అఖిలేష్ యాద‌వ్‌ దుయ్యబ‌ట్టారు.

Next Story

Most Viewed