క్షమాపణ చెప్పండి లేదా సంతకం చేయండి: రాహుల్ గాంధీకి ఈసీ హెచ్చరిక

by Phanindra |   (  Updated:2025-08-08 15:54:55  IST  )

ఈసీపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని, లేదా డిక్లరేషన్‌పై సంతకం చేయాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

క్షమాపణ చెప్పండి లేదా సంతకం చేయండి: రాహుల్ గాంధీకి ఈసీ హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల్లో మోసం జరిగిందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం (ఈసీ) మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై అభ్యంతరాలు లేవనెత్తే డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేసి సమర్పించాలని, లేదా అసంబద్ధపు ఆరోపణలు చేసినందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది. ‘చట్టప్రకారం కొన్ని ప్రక్రియలు ఎలా జరగాలని ఉంటే అలాగే జరగాలి. ఒకవేళ రాహుల్ గాంధీకి తన విశ్లేషణపై, ఈసీపై చేస్తున్న ఆరోపణలపై నమ్మకం ఉంటే చట్టాన్ని గౌరవించి డిక్లరేషన్‌పై సంతకం చేయాలి.

లేదంటే ఇలాంటి ఈసీపై అసంబద్ధ ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలి’ అని ఈసీ పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ సీటులో భారీగా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపించారు. గురువారం నాడు ఇండియా కూటమి నేతలకు ఇచ్చిన ప్రజంటేషన్‌లో పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో డిక్లరేషన్ రాసి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు సమర్పించాలని ఈసీ డిమాండ్ చేసింది. అయితే రాహుల్ ఈ డిక్లరేషన్ ఇవ్వలేదు.

తాను పార్లమెంటులో రాజ్యాంగంపై ప్రమాణం చేశానని అన్నారు. దీనిపై స్పందించిన ఈసీ.. ‘కమల్ నాథ్ జడ్జిమెంట్ ప్రకారం మెషీన్ రీడబుల్ డాక్యుమెంట్ల అంశంలో స్పష్టమైన విధానం ఉంది. వాటిని పట్టించుకోకుండా ఒకే తరహా సమస్యలను ఎత్తిచూపుతూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను రాహుల్ అవమానిస్తున్నారు’ అని పేర్కొంది. చట్టప్రకారం ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి, అప్పీల్ చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ చట్టబద్ధమైన ప్రక్రియలో వెళ్లకుండా మీడియాలో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ సమస్యను సెన్సేషన్ చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది.

Next Story