అమిత్ షా ఫేక్ వీడియో వైరల్: కేసు నమోదు చేసిన పోలీసులు

by Dishanational2 |
అమిత్ షా ఫేక్ వీడియో వైరల్: కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైరల్ అవుతున్న వీడియోల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా మాట్లాడడం కనిపిస్తోంది. అయితే రిజర్వేషన్‌ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియో షేర్ చేశారు. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్‌లో పేర్కొంది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది. వైరల్ అవుతున్న వీడియో మొత్తం ఫేక్ అని వెల్లడించింది. అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని స్పష్టం చేసింది. పూర్తిగా ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని ఆరోపించారు. వెంటనే వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల నుంచి డిలీట్ చేయాలని కోరారు.

కాగా, దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సైబర్ వింగ్ వీడియో ఏయే ఖాతాల్లో పోస్ట్ చేశారనే దానిపై విచారణ చేపట్టారు. ఈ మేరకు ఎక్స్, ఫేస్ బుక్‌లకు కూడా లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోందని, వారు చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదని తెలిపారు.

Next Story

Most Viewed