కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు: ఆ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుకు ఓకే

by Dishanational2 |
కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు: ఆ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుకు ఓకే
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య సీట్ల ఒప్పందం ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, గోవా. చండీగఢ్‌లలో సీట్ షేరింగ్‌కు రెండు పార్టీలు అంగీకరించారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్‌ నేత ముకుల్‌ వాస్నిక్‌, ఆప్‌ నేత సందీప్‌ పాఠక్‌లు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఢిల్లీలోని 7 సీట్లకు గాను..కాంగ్రెస్ 3, ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలో ఆప్ బరిలో దిగనుండగా..చాందినీచౌక్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇక, గుజరాత్‌లోని భరూచ్‌, భావ్‌నగర్‌లలో ఆప్‌ పోటీ చేయనుండగా, మిగిలిన 24 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. హర్యానాలో 10 సెగ్మెంట్స్‌లో ఒక స్థానాన్ని(కురుక్షేత్ర) ఆప్‌కు కేటాయించారు. గోవాలో ఉన్న రెండు స్థానాలు, చండీగఢ్‌లోని ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ బరిలో నిలవనుంది. సుధీర్ఘ చర్చల అనంతరం సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పంజాబ్‌పై నో క్లారిటీ!

ఐదు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటించిన ఇరు పార్టీలు పంజాబ్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఇరు పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతాయని గతంలో కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 13లోక్ సభ స్థానాలుండగా ఆప్ రాష్ట్రంలో అధికార పార్టీగా కొనసాగుతోంది. ఇప్పటికే యూపీలోనూ సీట్ షేరింగ్‌పై స్పష్టత రావడం..తాజాగా కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదరడంతో ఇండియా కూటమికి కాస్త ఊరట కలిగిందని చెప్పొచ్చు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ) ఎనిమిది సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక్కడ కూడా చర్చలు ముగిశాయని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే చాన్స్ ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

దేశానికి బలమైన ప్రత్యామ్నాయం అవసరం: ఆప్

సీట్ల ప్రకటన అనంతరం ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి అప్రజాస్వామిక పద్దతులను అవలంభిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యో్ల్బనంతో దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నా కాషాయ పార్టీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి బలమైన ప్రత్యామ్నాయం అవసరమని తెలిపారు. అందుకే సొంత రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి కూటమిలో చేరినట్టు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం ఖాయమని తెలిపారు. మరోవైపు సీట్ల ఖరారుపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్, ఆప్‌లు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించింది.


Next Story