రైతులకు అలర్ట్: ఎరువుల కొరతపై కేంద్రం అధికారిక ప్రకటన

by Ramesh Naini |   (  Updated:2026-03-27 11:45:54  IST  )

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల (అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్) కారణంగా దేశంలో ఎరువుల కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

రైతులకు అలర్ట్: ఎరువుల కొరతపై కేంద్రం అధికారిక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల (అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్) కారణంగా దేశంలో ఎరువుల కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రైతులు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశంలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలు దేశంలో అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. గురువారం అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో మాట్లాడి, నిల్వల లభ్యతపై సమన్వయం చేసుకున్నట్లు తెలిపారు.

ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ

ముడిసరుకుల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అదే సమయంలో ఇతర దేశాలతో దీర్ఘకాలిక దిగుమతి ఒప్పందాలు చేసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఇటీవల హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఇతర మంత్రులతో కూడిన మంత్రుల బృందం సమావేశమై ఎరువుల సరఫరాపై సమీక్షించింది. తాజా పరిస్థితుల వల్ల ఉత్పత్తిపై 0.6 నుంచి 0.9 మిలియన్ టన్నుల మేర ప్రభావం పడే అవకాశం ఉండటంతో, మొరాకో వంటి దేశాల నుంచి అదనంగా దిగుమతులు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా

అలాగే హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం, సహజ వాయువు (LNG) ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయని ‘ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FAI)’ డైరెక్టర్ జనరల్ సురేష్ కుమార్ చౌదరి తెలిపారు. ఎరువుల వినియోగంలో ప్రపంచంలో రెండో స్థానంలో, ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్న భారత్‌కు ఈ పరిస్థితులు సవాల్‌గా మారినప్పటికీ.. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య ఉన్న పటిష్ట సమన్వయంతో ఈ సమస్యను విజయవంతంగా అధిగమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Next Story