మత మార్పిడుల నిరోధానికి ‘60 : 60’ రూల్.. బీజేపీ సర్కారు సన్నాహాలు

by Dishanational4 |
మత మార్పిడుల నిరోధానికి ‘60 : 60’ రూల్.. బీజేపీ సర్కారు సన్నాహాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మత మార్పిడుల నిరోధానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ సర్కారు అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు ఇప్పటికే రెడీ అయినట్లు తెలుస్తోంది. తదుపరిగా జరగబోయే అసెంబ్లీ సెషన్‌లో ఈ బిల్లును ప్రవేశపెడతారని అంటున్నారు. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. మత మార్పిడులు చేసుకునే వారు కొంత చట్టపరమైన ప్రాసెస్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మత మార్పిడి చేసుకోవడానికి కనీసం 60 రోజుల ముందు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, వ్యక్తిగత వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలి. ఆ తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. మత మార్పిడి వెనుక ఉన్న ఉద్దేశం, కారణాలపై దర్యాప్తు చేస్తారు. బలవంతపు మత మార్పిడి జరగడం లేదని పోలీసుల నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ఈవిధంగా మత మార్పిడి చేసుకున్నాక 60 రోజుల్లోగా మరోసారి ఇంకో డిక్లరేషన్ ఫామ్‌ను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలి. మత మార్పిడి ధ్రువీకరణ కోసం కలెక్టర్ ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావాలి. పైన చెప్పుకున్న ప్రాసెస్‌లో ఏ ఒక్కటి పూర్తి చేయకున్నా ఆ మత మార్పిడిని అక్రమమైనదిగా జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. మత మార్పిడి చేసుకున్న వ్యక్తిపై రక్త సంబంధీకుల్లో ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేస్తారు. దీనిపై సెషన్స్ కోర్టు విచారణ చేపడుతుంది. తమ పూర్వ మతంలోకి తిరిగి మారాలనుకునే వారికి మాత్రం ఈ చట్టం వర్తించదని బిల్లులో ప్రస్తావించడం గమనార్హం. బలవంతపు మతమార్పిడి బాధితులుగా పోలీసులు గుర్తించిన వారికి రూ.5 లక్షల దాకా పరిహారం లభిస్తుందనే నిబంధన కూడా ఈ బిల్లులో ఉంది.

Next Story