ఎయిర్‌బస్ A320 విమానాలు రీకాల్.. ఎయిరిండియా, ఇండిగో సర్వీసులపై ప్రభావం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-29 03:14:53  IST  )

యూరప్‌లోని ప్రముఖ విమాన నిర్మాణ సంస్థ ఎయిర్‌బస్ సంచలన ప్రకటన చేసింది.

ఎయిర్‌బస్ A320 విమానాలు రీకాల్.. ఎయిరిండియా, ఇండిగో సర్వీసులపై ప్రభావం
X

దిశ, వెబ్‌డెస్క్: యూరప్‌లోని ప్రముఖ విమాన నిర్మాణ సంస్థ ఎయిర్‌బస్ సంచలన ప్రకటన చేసింది. ఎయిర్‌బస్ A320 విమానాల్లో సోలార్ రేడియేషన్ ప్రభావంతో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ డేటా కరప్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఎయిర్‌బస్ హెచ్చరికలు జారీ చేస్తూ రీకాల్ ప్రకటించింది. ఈ హఠాత్పరిణామంతో భారత్‌లో ఇండిగో, ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన విమానయాన సంస్థల సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దేశంలో సుమారు 200 నుంచి 250 ఎయిర్‌బస్ A320 సిరీస్ విమానాలకు తక్షణమే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో పాటు హార్డ్‌వేర్ సర్దుబాటు చేయాల్సి ఉందని ఎయిర్‌బస్ ప్రకటించింది. ఈ పనుల కోసం విమానాలను గ్రౌండ్ చేయవలసి రావడంతో ఇంజనీర్లు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు.

ఇటీవల ఓ దేశంలో ఎయిర్‌బస్ A320 విమానం ఆకస్మికంగా కిందికి దిగినట్లు (Pitch Down) రికార్డు అయింది. అందుకు ప్రధాన కారణం ఎలివేటర్ ఎయిలరాన్ కంప్యూటర్ (ELAC)లో లోపమేనని ఎయిర్‌బస్ గుర్తించింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) అత్యవసర ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్ (Emergency AD) జారీ చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న A320 సిరీస్ విమానాలన్నింటికీ కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలని లేదా ELAC యూనిట్‌ను మార్చాలని ఆదేశించింది. కాగా, భారత్‌లో మొత్తం 560కి పైగా A320 సిరీస్ విమానాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇండిగో, ఎయిరిండియా సంస్థలు కీలక ప్రకటనలు చేశాయి. ఎయిర్‌బస్ టెక్నికల్ అడ్వైజరీ తెలిసిందని, తమ ఫ్లీట్‌లోని విమానాలపై అవసరమైన అప్‌డేట్లు సురక్షితంగా, పూర్తి జాగ్రత్తలతో చేపడుతున్నామని రెండు సంస్థలూ ప్రకటించాయి. ఈ ప్రక్రియలో కొన్ని ఫ్లైట్ షెడ్యూల్స్‌లో స్వల్ప మార్పులు రావచ్చని ఇండిగో తెలిపింది. అదేవిధంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 31 విమానాల్లో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించామని ఎయిరిండియా గ్రూప్ వెల్లడించింది.

Next Story