ఎయిర్‌ఇండియా విమాన ప్రమాదం..ఇంధన స్విచ్‌లపై కీలక అనుమానాలు

by Yella Dhawani Reddy |

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన (Air India Plane Crash)తో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే.

ఎయిర్‌ఇండియా విమాన ప్రమాదం..ఇంధన స్విచ్‌లపై కీలక అనుమానాలు
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన (Air India Plane Crash)తో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వాల్ స్ట్రీట్ జర్నల్ కీలక కథనం ప్రచురించింది. ఇందులో, విమానంలోని ఇంధన సరఫరా స్విచ్‌లు అనుకోకుండా లేదా ఇతర కారణాల వల్ల ఆఫ్ అయ్యే అవకాశం ఉందని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారని పేర్కొంది. రెండు జీఈ సంస్థకు చెందిన జెట్ ఇంజిన్లు సక్రమంగా పనిచేస్తున్నాయని, థ్రస్ట్ సమస్య స్విచ్‌ల వల్లే తలెత్తిందని నివేదిక వెల్లడిస్తోంది. టేకాఫ్ సమయంలో సాధారణంగా స్విచ్‌లు "ఆన్" స్థితిలో ఉంటాయని, అవి ఎలా ఆఫ్ అయ్యాయన్నది ఇంకా నిశ్చయించలేనిదిగా చెబుతోంది.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంధన స్విచ్‌లను ఆఫ్ చేసే అవసరం వస్తుందని, తక్షణ ప్రమాదం ఎదురవుతుండగా ఈ స్విచ్‌లను మళ్లీ ఆన్ చేసేందుకు ప్రయత్నించారా? లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాటిని ఆపివేసారా? అనే అంశాలు ఇంకా స్పష్టతను పొందలేదని వెల్లడించింది. స్విచ్‌లు ఆఫ్ అయిన తర్వాత విమానంలో “ర్యామ్ ఎయిర్ టర్బైన్” (RAT) యాక్టివేట్ కావడం కూడా తటస్థంగా స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు. ఈ పరిణామాలపై పూర్తి స్పష్టత కోసం డేటా విశ్లేషణ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, భారత్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ దుర్ఘటనపై విచారణను చేపట్టి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నివేదికను మంగళవారం పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక నివేదిక అతిత్వరలో విడుదల కావచ్చన్న అంచనాలు ఉన్నాయి. కాగా, విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఇందులో ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులతో పాటు అమెరికా NTSB సభ్యులు కూడా ఉన్నారు. ప్రమాదం అనంతరం బ్లాక్‌బాక్స్‌లు ల్యాబ్‌కు తరలించి, అందులోని డేటాను విజయవంతంగా డౌన్‌లోడ్ చేసి విశ్లేషణ చేపట్టారు. తుదితీర్పు కోసం ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Next Story