రోడ్లపై గుంతలకు AI అద్భుత పరిష్కారం.. మిలియన్ల కొద్దీ నిధులు సేవ్

by Prasad Jukanti |

రహదారి గుంతల సమస్యకు ఏఐ పరిష్కారం చూపిస్తోంది. 'గ్రౌండ్ ఇంటెలిజెన్స్' ద్వారా ముందే గుంతల గుర్తించి ప్రభుత్వాలకు నిధులు మిగిల్చేలా చేస్తోంది.

రోడ్లపై గుంతలకు AI  అద్భుత పరిష్కారం..  మిలియన్ల కొద్దీ నిధులు సేవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం ఊహకందని అద్భుతాలు సృష్టిస్తోంది. ఎన్నో ఏళ్ల మానవ పరిణామ క్రమంలో అసాధ్యం అనుకున్నవి అనేకం ఈ వ్యవస్థ సుసాధ్యం చేసి చూపిస్తోంది. విద్య నుంచి వైద్యం వరకూ, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఏఐ సాంకేతికత మన జీవనవిధానాన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్తున్నాయి. అనేక రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న కృత్రిమ మేధా తాజాగా రోడ్డు భద్రత విషయంలో సరికొత్త పరిష్కారానికి కేరాఫ్‍గా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా వినియోగించే రోడ్డు మార్గంలో అసలైన సవాలుగా మారిన రహదారులపై గుంతల సమస్యకు తాజాగా ఏఐ అద్భుతమైన పరిష్కారం చూపిస్తోందని తద్వారా ప్రతి యేటా ప్రభుత్వాలు రోడ్ల మరమ్మతుల కోసం వెచ్చించే మిలియన్ల కొద్దీ నిధులను సేవ్ చేసే దిశగా ఏఐ సరికొత్త పరిష్కారం చూపుతున్నట్లు తాజాగా వెల్లడైన ట్రయల్ రన్‍లో స్పష్టమైంది.

ముందుగానే గుర్తింపు:

మన దేశంలో రోడ్ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నగా ఏర్పడిన గుంతలను పూడ్చకపోవడంతో ఏర్పడే పర్యవసానాలు తెలియనివి కావు. ఈ గుంతల కారణంగా ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా కొన్ని చోట్ల అసలు గుంతు ఏర్పడిన సంగతే అధికార యంత్రాంగానికి సమాచారం ఉండదు. కానీ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన సామ్సారా కంపెనీ ప్రారంభించిన 'గ్రౌండ్ ఇంటెలిజెన్స్' అనే వ్యవస్థ రోడ్ల మరమ్మత్తు విషయంలో కొత్త పరిష్కారాలకు మార్గం చూపిస్తోంది. ఈ వ్యవస్థ వాణిజ్య ట్రక్కులలో ఇప్పటికే అమర్చిన కెమెరాల ద్వారా రోడ్డు పరిస్థితులను ఏఐ సహాయంతో విశ్లేషిస్తోంది. రహదారి దెబ్బతినకముందే గుంతలను గుర్తించడం, వాటి తీవ్రతను అంచనా వేయడం మరియు అవి ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో ట్రాక్ చేస్తూ వివరిస్తోంది.

ప్రభుత్వాలకు నిధులు సేఫ్:

సామ్సారా కంపెనీ తమ ట్రక్కుల్లో పని చేసే డ్రైవర్ల పర్యవేక్షణ, దొంగతనాల నివారణ, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల కోసం వాహనాల్లో కెమెరాలను అమర్చింది. ప్రతిరోజూ నగరాలు హైవేలపై తిరిగే ట్రక్కుల నుండి భారీ స్థాయి ఫుటేజీని సేకరిస్తోంది. అయితే ఇటీవల ఈ ఫుటేజ్‍ను ద్వారా రహదారుల పరిస్థితులు ఏంటి?, ఎక్కడెక్కడ గుంతలు ఏర్పడే అవకాశం ఉందో గుర్తించేలా ఏఐ సిస్టమ్స్‌కు శిక్షణ కల్పించింది. దీంతో రహదారుల పరిస్థితులపై ఏఐ అంచనా వేసి రహదారి నిర్వహణను మెరుగుపరిచేలా ఆ సమాచారం చేరవేస్తోంది. క్రమంలో వేమో (Waymo) వేజ్ (Waze) వంటి సంస్థలు కూడా గుంతల సమాచారాన్ని ప్రభుత్వాలతో పంచుకునే వ్యవస్థలను పరీక్షిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా గుంతలు ఏర్పడే అవకాశం ఎక్కడ ఉందో ముందుగానే పసిగట్టగలగడం, తద్వారా కేవలం ప్రజల ఫిర్యాదులపైనే ఆధారపడకుండా, ఏ రోడ్లకు అత్యవసరంగా మరమ్మతులు అవసరమో నిర్ణయించడంలో అధికారులకు ఈ సాంకేతికత సహాయపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో పాతబడుతున్న రోడ్లు, పెరుగుతున్న మరమ్మతు ఖర్చులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఏఐ టెక్నాలజీ

రహదారి భద్రత మెరుగుదలకు, ఖర్చుల తగ్గింపుకు పరిష్కారంగా చూపబోతున్నట్లు నిపుణలు అంచనా వేస్తున్నారు. ఇటువంటి టెక్నాలజీ మన దేశంలోనూ అందుబాటులోకి వస్తే రహదారుల ప్రమాదాలతో పాటు మరమ్మతుల వ్యయం తగ్గే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story