అటువంటి రాజకీయాలకు వ్యతిరేకం: కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
అటువంటి రాజకీయాలకు వ్యతిరేకం: కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఇండియా కూటమిలో చేరలేదని స్పష్టం చేశారు. ఎంఎన్ఎం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని చెన్నయ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధి, నిస్వార్థంగా పనిచేసే పార్టీకే ఎంఎన్ఎం మద్దతిస్తుందని తేల్చిచెప్పారు. ఫ్యూడల్ రాజకీయాలు చేసే వారితో తమ పార్టీ చేతులు కలపబోదని తెలిపారు. అటువంటి పాలిటిక్స్‌కు దూరంగా ఉంటామని వెల్లడించారు. ఇండియా కూటమిలో చేరలేదని, కానీ రాజకీయ పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని ఈ విషయం త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం దేశం గురించి ఆలోచించే సమయమని..కాబట్టి దేశాభివృద్ధి కోసం పనిచేసే ఏ కూటమిలోనైనా చేరేందుకు ఎంఎన్ఎం సిద్ధమని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యత అని నొక్కిచెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో ఎంఎన్ఎం పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు ఇటీవల వెలువడ్డాయి. దీంతో కమల్ హాసన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, మక్కల్ నీది మయ్యం పార్టీని కమల్ హాసన్ 2018లో ప్రారంభించారు. అనంతరం 2019 లోక్ సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపలేదు.

Next Story

Most Viewed