Aero India: ఘనంగా ప్రారంభమైన ఏరో ఇండియా.. అలరించిన వైమాణిక విన్యాసాలు

by B.Srinivas |

భద్రత బలహీనంగా ఉన్నప్పుడు శాంతిని సాధించలేమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి మార్గానికి మద్దతిస్తుందని నొక్కి చెప్పారు.

Aero India: ఘనంగా ప్రారంభమైన ఏరో ఇండియా.. అలరించిన వైమాణిక విన్యాసాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భద్రత బలహీనంగా ఉన్నప్పుడు శాంతిని సాధించలేమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Rajnath singh) అన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి మార్గానికి మద్దతిస్తుందని నొక్కి చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరు (Bengaluru)లో జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనలలో ఒకటైన ఏరో ఇండియా (Aero india) 2025 15వ ఎడిషన్‌ను రాజ్ నాథ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాలు కలిసి బలంగా మారి మెరుగైన ప్రపంచ క్రమం కోసం కృషి చేస్తేనే శాశ్వత శాంతిని సాధించగలమని అభిప్రాయపడ్డారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వానికి మద్దతుదారుగా ఉందన్నారు. భారత్ పరివర్తన దశలో పయనిస్తోందని, అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఒకవైపు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా దేశ సంస్కృతిని ప్రదర్శిస్తుండగా, మరోవైపు ఏరో ఇండియా భారతదేశ శక్తిని ప్రదర్శిస్తోందని కొనియాడారు.

అలరించిన విన్యాసాలు

ఐదు రోజుల పాటు జరగనున్న ఈ ప్రోగ్రాంలో మొదటి రోజు వైమాణిక విన్యాసాలు అలరించాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఐదో తరం యుద్ధ విమానాలలైన రష్యన్ ఎస్‌యూ-57, అమెరికన్ F-35 లైట్నింగ్-II విమానాలు ప్రదర్శన ఇచ్చాయి. ఈ రెండు విమానాలు భారతదేశంలో తమ విన్యాసాలను ప్రదర్శించడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఏరో ఇండియా -2025 42,438 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతోంది. వివిధ దేశాల నుంచి 30 మంది రక్షణ మంత్రులు, 43 మంది సైనిక అధిపతులు పాల్గొననున్నారు. మొత్తం 90 దేశాలు ఈ కార్యక్రమంలో ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ప్రదర్శనలో 70 ఫైటర్ జెట్‌లు, కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, శిక్షణా విమానాలు వైమాణిక విన్యాసాలు చేయనున్నాయి.

Next Story