అనూహ్య పరిణామం..శరద్ పవార్ తో అదానీ భేటీ!

by Dishanational2 |
అనూహ్య పరిణామం..శరద్ పవార్ తో అదానీ భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు పట్టుబడుతున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో గౌతమ్ అదానీ భేటీ కావడం సంచలనంగా మారింది. గురువారం ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వచ్చిన అదానీ దాదాపు రెండు గంటలకు పైగా సమావేశం అయ్యారు. అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కార్నర్ చేస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కు ప్రధాన మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీ త్వరలో బీజేపీ కూటమిలో చేరబోతోందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

ఈ క్రమంలో తమ పార్టీ అధినేత శరద్ పవార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని అజిత్ పవార్ సైతం క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో శరద్ పవార్ తో అదానీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకు ముందు జేపీసీ కమిటీ కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టడాన్ని శరద్ పవార్ విమర్శించారు. అదానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయాలని రాహుల్ గాంధీ అనుకోవడం సరికాదని, అదానీపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అదానీ దేశంలో అనేక రకాల సేవలు చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ క్రమంలో అదానియే శరద్ పవార్ నివాసానికి వచ్చి భేటీ కావడంతో అదానీ, పవార్ ఏం చర్చించుకున్నారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వీరి భేటీతో శరత్ పవార్ కాంగ్రెస్ కు హ్యాండిచ్చి బీజేపీలో చేరుతారా అనే ప్రచారం ఊపందుకుంది. ఇదే జరిగితే కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఊహించని దెబ్బగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


Next Story

Most Viewed