సోనియాగాంధీకి షాక్.. ఆ ఆరోపణలపై హోంశాఖ చర్యలు

by Disha Web Desk 2 |
సోనియాగాంధీకి షాక్.. ఆ ఆరోపణలపై హోంశాఖ చర్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీ కుటుంబానికి అనుబంధంగా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే ఎన్జీఓ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ విరాళాల సేకరణ విషయంలో అవకతవకలు జరిగాయని కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది. సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ) చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు దస్త్రాలను వక్రీకరించడం సహా, చైనా, విదేశాల నుంచి నిధులు పొందుతూ మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు. 2020లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్-మంత్రిత్వ కమిటీ విచారణ తర్వాత ఈ చర్యలు తీసుకుంది.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌పై విచారణ జరిపిన అనంతరం ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సంబంధించిన ఇతర ట్రస్ట్‌లలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ స్థాపించారు. 1991 జూలైలో సోనియా గాంధీ నేతృత్వంలో ఫౌండేషన్ కోసం తీర్మానం ఆమోదించింది. 1991లో స్థాపించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ 1991 నుండి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, వికలాంగుల సహాయం మొదలైన అనేక ముఖ్యమైన సమస్యలపై పని చేసింది.



Next Story

Most Viewed