బిగ్ న్యూస్: BRSకు షాకిచ్చేలా ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: BRSకు షాకిచ్చేలా ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌ను విస్తరించాలని చూస్తున్న సీఎం కేసీఆర్‌కు ఆయన మిత్రుల వైఖరి అంతుచిక్కడం లేదు. సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న గులాబీ బాస్ ఆశలకు గండి కొట్టేలా ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ ఆలోచన చేయడం సంచలనంగా మారుతోంది.

బీజేపీని ఓడించడమే టార్గెట్‌గా కేసీఆర్ బీఆర్ఎస్ తీసుకువచ్చామని చెబుతున్నారు. ఇందుకోసం కలిసి వచ్చే పార్టీలతో నడిచేందుకు సిద్ధమే అనే సంకేతాలు గులాబీ నేతలు చేస్తున్నారు. సౌత్ స్టేట్‌లో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో ఎలాగైన కమలం పార్టీని నిలువరించాలని కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కర్ణాటక నుంచే బీఆర్ఎస్ విస్తరణకు శ్రీకారం చుట్టి బీజేపీకి కోలుకోలేని షాక్ ఇవ్వాలని చూస్తున్న కేసీఆర్‌కు ఆయన మిత్రుడు కేజ్రీవాల్ వ్యూహం ఇప్పుడు సందేహంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

సౌత్‌పై కన్నేసిన కేజ్రీవాల్:

పంజాబ్‌లో అనూహ్య విజయంతో జోష్ మీదున్న కేజ్రీవాల్ తమ పార్టీని క్రమంగా విస్తరించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో పోటీ చేసి ఆప్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఆప్‌ను మరింత విస్తరించేలా కేజ్రీవాల్ ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు తానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు.

ఇందులో భాగంగా మార్చి4న కర్ణాటక, 5న ఛత్తీస్ గఢ్, 13న రాజస్థాన్, 14న రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కర్ణాటక ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారనుంది. ఇక్కడ అధికార బీజేపీకి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తోంది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల మాదిరిగా 'నమ్మ క్లినిక్', 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ హామీలను కూడా ఇచ్చింది.

కేజ్రీవాల్‌తో కేసీఆర్ కలిసి పోటీ చేస్తారా?

రాబోయే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి బీఆర్ఎస్ బలమేంటో పరీక్షించుకునేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తుంటే.. ఇంతలో అనూహ్యంగా కేజ్రీవాల్ సైతం కర్ణాటకలో స్పీడ్ పెంచడంతో చర్చగా మారుతోంది. బీఆర్ఎస్ జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తుందనే ప్రచారం ఉండగా దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. అయితే ఇటీవల కేజ్రీవాల్‌తో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీల నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేసే విషయంలో ఈ రెండు పార్టీలు విభేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక విషయంలో కేజ్రీవాల్ నిర్ణయం కేసీఆర్‌కు ఏ విధంగా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.

బీఆర్ఎస్, ఆప్ కలిసి కర్ణాటకలో బరిలో నిలుస్తాయా లేక ఎవరికి వారే పోటీకి సై అంటారా అనేది తేలాల్సి ఉంది. మరో వైపు శుక్రవారం కేజ్రీవాల్ ముంబై వెళ్లి మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేతో భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలకు ముంగిట్లో ఇది కీలక పరిణామం. ఓ వైపు కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం జరుగుతుండగా వీరిద్దరి భేటీ జరిగింది. అలాగే ఈ ఏడాది ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ ఉద్ధవ్ థాక్రే కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నారు. కేజ్రీవాల్ ఎంట్రీతో ఆయన తన మనసు మార్చుకుంటారా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కేజ్రీవాల్‌తో కలిసి పోతారా అనేది ఉత్కంఠ రేపుతోంది.


Next Story