నడిరోడ్డుపై మహిళ నమాజ్.. ట్రాఫిక్ జామ్ : విచారణలో మైండ్ బ్లాకయ్యే ట్విస్ట్!

by Ramesh Naini |

రద్దీగా ఉండే రహదారి.. రయ్ మంటూ దూసుకెళ్లే వాహనాలు.. ఇంతలో ఓ మహిళ హఠాత్తుగా రోడ్డు మధ్యలోకి వచ్చి నమాజ్ చేయడం ప్రారంభించింది.

నడిరోడ్డుపై మహిళ నమాజ్.. ట్రాఫిక్ జామ్ : విచారణలో మైండ్ బ్లాకయ్యే ట్విస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రద్దీగా ఉండే రహదారి.. రయ్ మంటూ దూసుకెళ్లే వాహనాలు.. ఇంతలో ఓ మహిళ హఠాత్తుగా రోడ్డు మధ్యలోకి వచ్చి నమాజ్ చేయడం ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ వింత ఘటన కేరళలోని పాలక్కడ్‌లో బుధవారం చోటుచేసుకుంది. అయితే, ఆమె అలా చేయడానికి గల కారణం తెలిసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది.

అసలేం జరిగిందంటే?

పాలక్కడ్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఐఎంఏ (IMA) జంక్షన్‌లో ఈ సంఘటన జరిగింది. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఓ మహిళ.. వాహనాల రద్దీని ఏమాత్రం లెక్కచేయకుండా రోడ్డు మధ్యలో కూర్చొని ప్రార్థనలు (నమాజ్) చేయడం మొదలుపెట్టింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, స్థానికులు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పాలక్కడ్ సౌత్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ‘ఎందుకిలా చేశారు? ’ అని పోలీసులు ప్రశ్నించగా.. ఆమె చెప్పిన సమాధానం విని అధికారులు షాక్ తిన్నారు.

పోలీసుల అదుపులోకి..

కేవలం తన ‘కుటుంబ ఆస్తి వివాదం’ (Family Property Dispute) వైపు ప్రజల, అధికారుల దృష్టిని ఆకర్షించేందుకే తాను ఇలా నడిరోడ్డుపై నమాజ్ చేశానని ఆమె పోలీసులకు వివరించింది. తన సమస్యను పరిష్కరించుకోవడానికి ఇదో నిరసన మార్గంగా ఆమె ఎంచుకున్నట్లు వెల్లడించింది. కాగా, వ్యక్తిగత సమస్యల కోసం ఇలా బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు గానూ.. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్ అంతరాయంపై ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story