- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వేలకు అందని నిశ్శబ్ద విప్లవం.. ఎగ్జిట్ పోల్స్ తలకిందులు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి.

దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే, ఈసారి ఫలితాలు దాదాపు అన్ని ప్రముఖ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ (Exit Poll) అంచనాలను తలకిందులు అయ్యాయి. ఓటరు నాడిని పసిగట్టడంలో రాజకీయ విశ్లేషకులు విఫలం కాగా, క్షేత్రస్థాయిలో ఓటర్లు మాత్రం ఓ నిశ్శబ్ద విప్లవమే సృష్టించారు. తమిళనాడులో డీఎంకే (DMK) కూటమి, ఏఐఏడీఎం (AIDMK)కే మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని సర్వేలు చెప్పాయి. కానీ, ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సంచలనం సృష్టించింది. వీకేకు గరిష్టంగా 25 స్థానాలు వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. కానీ, టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. ఒక్క యాక్సిస్ ఇండియా సంస్థ మాత్రం టీవీకేకు 98 నుంచి 120 స్థానాలు వస్తాయని చెప్పింది. విజయ్ ప్రకటించిన రైతు రుణమాఫీ, మహిళలకు రూ.2,500 వంటి హామీలు ఓటర్లను భారీగా ఆకట్టుకున్నాయి.
మమతా కోటలో కమల వికాసం
బెంగాల్లో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీ నాలుగోసారి విజయం సాధిస్తుందని, 130 నుంచి 140 స్థానాలు వస్తాయని కొన్ని సర్వేలు చెప్పగా, బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని పేర్కొన్నాయి. తీరా చూస్తే ఫలితాల్లో బీజేపీ ఏకంగా 192 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించి మమతా కోటను బద్దలు కొట్టింది. టీఎంసీ కేవలం 92 స్థానాలకే పరిమితమైంది. ప్రధాని మోదీ ‘ఝల్ మురి’ తింటూ ప్రజలతో మమేకమైన తీరు బీజేపీకి సానుకూలంగా మారింది.
యూడీఎఫ్ పునరాగమనం
కేరళలో ఎల్డీఎఫ్ (LDF) మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్లో ప్రకటించారు. కానీ, ఫలితాలు అందుకు భిన్నంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కు పట్టం కట్టాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కీలక పాత్ర పోషించింది. మంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan)తో పాటు మంత్రులు ఇక్కడ వెనుకంజలో ఉన్నారు.
అస్సాం, పుదుచ్చేరిలో..
ఒక్క అస్సాం, పుదుచ్చేరిలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ కూటమి వరుసగా మూడోసారి విజయం సాధించి రికార్డు సృష్టించింది. అయితే, టీవీకే వంటి పార్టీలు మహిళల కోసం ప్రకటించిన నగదు బదిలీ పథకాల ప్రభావాన్ని సర్వే సంస్థలు కచ్చితంగా అంచనా వేయలేకపోయాయి. మొదటిసారి ఓటు వేస్తున్న యువత సంప్రదాయ పార్టీల కంటే కొత్త నాయకత్వం టీవీకేకు ప్రాధాన్యతనిచ్చారు. జాతీయ అంశాల కంటే ప్రాంతీయ ప్రయోజనాలు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి అంశాలు తమిళనాడు ఎన్నికల తీర్పును మార్చేశాయి.






