పెళ్లికి నో చెప్పిన లవర్.. 20 కిలో మీటర్లు చేజ్ చేసి మూడు ముళ్లు వేయించుకుంది

by Dishafeatures2 |
పెళ్లికి నో చెప్పిన లవర్.. 20 కిలో మీటర్లు చేజ్ చేసి మూడు ముళ్లు వేయించుకుంది
X

దిశ, వెబ్ డెస్క్: కొన్నేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. చివరికి పెళ్లి చేసుకోవాలని పెద్దల సమక్షంలో నిర్ణయించుకున్నారు. అయితే తీరా పెళ్లి సమయానికి పెళ్లికొడుకు చెప్పాపెట్టకుండా పారిపోయాడు. కానీ ఆ యువతి మాత్రం అతడిని వదలలేదు. 20 కిలో మీటర్లు చేజ్ చేసి అతడితో మూడు ముళ్లు వేయించుకుంది. అచ్ఛం సినిమాను తలపించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ లోని బదౌన్ జిల్లా బారాబంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని బారాదరికి చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో రెండున్నరేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ విషయాన్ని వాళ్ల పెద్దలకు చెప్పి ఒప్పించారు.

ఈ క్రమంలోనే బరేలిలోని భూతేశ్వర్ నాథ్ దేవాలయంలో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా యువతిని దేవాలయంలోని పెళ్లి మండపానికి తీసుకెళ్లారు. అయితే ముహూర్తం సమయానికి పెళ్లి కొడుకు మండపానికి రాలేదు. దీంతో పెళ్లి కూతురు అతడికి ఫోన్ చేసి విషయం అడిగింది. అయితే వాళ్ల అమ్మనాన్నలను తీసుకురావడానికి ఆలస్యం అయ్యిందని, వస్తున్నానని ఆ యువకుడు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి పెళ్లి కొడుకు కోసం కొంత సమయం పాటు వేచి చూసింది. కానీ అతడు ఎంతకూ రాకపోవడంతో తనను మోసం చేశాడని, ఎక్కడికో పారిపోతున్నాడని అనుమానం వచ్చిన యువతి అతడి కోసం బయలుదేరింది.

దాదాపు 20 కిలో మీటర్లు పెళ్లి దుస్తుల్లోనే ప్రయాణించి బ్యాగ్ సర్దుకొని బస్సెక్కి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న పెళ్లి కొడుకును పట్టుకుంది. అక్కడి నుంచి మళ్లీ 20 కిలో మీటర్లు వెనక్కి తీసుకొచ్చి అదే దేవాలయంలో వివాహం చేసుకుంది. కాగా ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోసం చేసేందుకు ప్రయత్నించిన యువకుడికి సరైన రీతిలో గుణపాఠం నేర్పిందని యువతిని ప్రశంసిస్తున్నారు.


Next Story

Most Viewed