JEE Main 2025: మరోసారి వార్తల్లో బిహార్ లోని ఐఐటీ విలేజ్

by Shamantha N |

బిహార్ లోని ఐఐటీ విలేజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. జేఈఈ మెయిన్‌ (JEE Main 2025) ఫలితాల్లో బిహార్ లోని గయా జిల్లాకు చెందిన ఐఐటీ విలేజ్ నుంచి 40 మంది ఉత్తీర్ణత సాధించారు.

JEE Main 2025: మరోసారి వార్తల్లో బిహార్ లోని ఐఐటీ విలేజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ లోని ఐఐటీ విలేజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. జేఈఈ మెయిన్‌ (JEE Main 2025) ఫలితాల్లో బిహార్ లోని గయా జిల్లాకు చెందిన ఐఐటీ విలేజ్ నుంచి 40 మంది ఉత్తీర్ణత సాధించారు. బిహార్‌లోని గయ జిల్లాలో ‘ఐఐటీ విలేజ్‌’ (village of IITians)గా గయా జిల్లాలోని పట్వా టోలీ (Patwa Toli) గ్రామానికి పేరుంది. ఈ ఏడాది అక్కడ్నుంచి 40 మంది పాస్ అవ్వగా.. వారిలో 28 మంది వృక్ష సంస్థాన్ కోచింగ్‌ సెంటర్‌ నుంచి శిక్షణ పొందినవారే. ఈ గ్రామం ‘ఐఐటీ విలేజ్‌’గా పేరు పొందడానికి కారణం ఆ ఊరికి చెందిన జితేంద్ర పట్వా. ఆయన 1991లో ఐఐటీలో సీటు పొందారు. ఆ గ్రామం నుంచి ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఆయనే. తర్వాత ఆయన కెరీర్ పరంగా ఎదిగి, యూఎస్‌లో నివసిస్తున్నారు.

వృక్ష్ వి ద ఛేంజ్

తమ గ్రామంలోని మిగతావారు తనలాగే ఎదగాలని జితేంద్ర పట్వా, వృక్ష్ వి ద ఛేంజ్ (Vriksh We The Change) పేరుతో ఎన్జీవోని స్థాపించారు. అప్పటినుంచి ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఐఐటీ పదం వినిపిస్తూనే ఉంది. 20వేల మంది గ్రామస్థులు ఉన్న పట్వాటోలీని గతంలో మాంచెస్టర్ ఆఫ్ బిహార్‌గా పిలిచేవారు. వస్త్ర పరిశ్రమలు, చేనేత పని చేసుకునేవాళ్లు ఎక్కువగా ఉండటంతో ఆ పేరు వచ్చింది. కానీ, వారి పిల్లలు మాత్రం విద్యారంగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. ఇకపోతే, 2013లో ఏర్పాటైన వృక్ష సంస్థాన్.. ఐఐటీల్లో చదవాలనుకునేవారికి ఉచిత కోచింగ్ అందిస్తోంది. గ్రాడ్యుయేట్లు అందించే నిధులతో మెటీరియల్స్ ఇస్తోంది. ఢిల్లీ, ముంబైలోని వారు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇస్తుంటారు. ‘‘చాలా కుటుంబాల్లో తమ పిల్లలను పట్టణాలకు పంపించి చదవించలేని పరిస్థితి ఉంది. అందుకోసమే మేం వృక్ష వేద చెయిన్‌ను ప్రారంభించాం. ఒక లైబ్రరీ మోడల్‌ను ఏర్పాటుచేశాం’’ అని వృక్ష వేద చెయిన్ ప్రెసిడెంట్ దుబేశ్వర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.

Next Story