పాక్ అనుకూల నినాదాలు.. ముగ్గురి అరెస్టు

by Hajipasha |
పాక్ అనుకూల నినాదాలు.. ముగ్గురి అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక రాజధాని బెంగళూరులోని విధాన సౌధలో ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరిగింది. కర్ణాటక ఎమ్మెల్యేలు వచ్చి విధాన సౌధలో ఓట్లు వేశారు. ఆ రోజు రాజ్యసభ ఎంపీగా నాసిర్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. దీంతో ఆయన అనుచరుల్లో కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వారు అరిచారనే ఆరోపణలు వినవస్తున్నాయి. నాసిర్‌ హుస్సేన్‌ జిందాబాద్ అని మాత్రమే వాళ్లు అరిచారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని పోలీసు సిబ్బందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో హావేరీ జిల్లా బ్యాడగికి చెందిన మహ్మద్ షఫీ, బెంగళూరులోని ఆర్టీ నగర్‌కు చెందిన మున్వర్, ఢిల్లీకి చెందిన ఇల్తాజ్ ఉన్నారు. తన సోదరుడి అరెస్టుపై మహ్మద్ షఫీ సోదరి స్పందిస్తూ.. ‘‘నా సోదరుడు అలాంటివాడు కాదు’’ అని ఆమె మీడియా ఎదుట వాపోయింది. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ‘‘వీడియో, ఆడియోలను ప్రైవేట్ ఏజెన్సీతో విశ్లేషణ చేయిస్తాం. పాకిస్తాన్‌కు మద్దతుగా ఆ ముగ్గురు యువకులు నినాదాలు చేసి ఉంటారని నేను భావించట్లేదు. నిజానిజాలను ఫోరెన్సిక్ నివేదిక బయటపెడుతుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. నివేదికను విడుదల చేయనివ్వండి’’ అని తెలిపారు.

Next Story

Most Viewed