ఎగ్జామ్ సెంటర్ వద్ద అపశ్రుతి.. నాలాలో పడిన 25 మంది బీఈడీ అభ్యర్థులు!

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం ఉదయం బీఈడీ ప్రవేశ పరీక్ష కేంద్రం వద్ద ఊహించని అపశ్రుతి చోటుచేసుకుంది.

ఎగ్జామ్ సెంటర్ వద్ద అపశ్రుతి.. నాలాలో పడిన 25 మంది బీఈడీ అభ్యర్థులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం ఉదయం బీఈడీ ప్రవేశ పరీక్ష కేంద్రం వద్ద ఊహించని అపశ్రుతి చోటుచేసుకుంది. మ్యాక్‌రాబర్ట్‌గంజ్ ప్రాంతంలోని హెచ్.ఎన్.మిశ్రా పీజీ కళాశాల సమీపంలో ఉన్న ఓ జిరాక్స్ దుకాణం ముందు నిలబడిన దాదాపు 20 నుంచి 25 మంది అభ్యర్థులు.. నాలాపై ఉన్న కాంక్రీట్ స్లాబ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో మురుగు కాలువలో పడిపోయారు.

ప్రమాదానికి కారణం ఏంటంటే?

పరీక్షకు ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరి అని అధికారులు చివరి నిమిషంలో చెప్పడంతో అభ్యర్థులు ఒక్కసారిగా ఆ జిరాక్స్ దుకాణానికి పోటెత్తినట్లు సమాచారం. అభ్యర్థుల రద్దీ భారాన్ని తట్టుకోలేక పాత స్లాబ్ కుంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు అభ్యర్థులకు, ఓ అభ్యర్థి వెంట వచ్చిన వ్యక్తికి గాయాలయ్యాయి. చాలా మంది అభ్యర్థుల బట్టలు, పుస్తకాలు, అడ్మిట్ కార్డులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు మురుగు నీటిలో తడిసి పాడయ్యాయి.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

స్థానికులు వెంటనే స్పందించి కాలువలో పడిన వారిని బయటకు తీశారు. అధికారుల నిర్లక్ష్యం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ గందరగోళం తర్వాత గాయపడిన వారికి వైద్య సహాయం అందించి పరీక్షా కేంద్రాలకు పంపించారు. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ నగరంలోని మొత్తం 19 కేంద్రాల్లో బీఈడీ ప్రవేశ పరీక్ష యథావిధిగా జరిగినట్లు పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ స్పష్టం చేశారు.

Next Story