ప్రపంచంలోనే కాస్టీయెస్ట్ ఎన్నికలుగా భారత ఎలక్షన్స్

by Dishanational1 |
ప్రపంచంలోనే కాస్టీయెస్ట్ ఎన్నికలుగా భారత ఎలక్షన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రజాస్వామ్యానికి ఐదేళ్లకొకసారి లోక్‌సభ ఎన్నికల పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు మొదలుకొని, చిన్నాచితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో వీధులన్నీ ప్రచారహోరుతో రద్దీగా ఉంటాయి. ఇదే సమయంలో ఇంతపెద్ద ఎన్నికల కోసం అయ్యే ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. రాజకీయ నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ఏడాది జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యధికంగా రూ. 1.35 లక్షల కోట్లు దాటనున్నాయి. దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 96.6 కోట్లు ఉంటే, ఒక్కో ఓటరుకు అయ్యే ఖర్చు రూ. 1,400 అవుతున్నట్టు. పైగా ఇదివరకు 2019లో అయిన ఎన్నికల ఖర్చు రూ. 60 వేల కోట్ల కంటే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ ఖర్చు అవుతోంది.

వాస్తవంలో అంచనాల కంటే ఎక్కువే ఖర్చు..

ఎన్నికల ఖర్చుకు సంబంధించి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(సీఎంఎస్) అనే స్వచ్ఛంద సంస్థ వివరాలను వెల్లడించింది. గడిచిన 35 ఏళ్లుగా ఈ అంశంపై పరిశీలన చేస్తున్న ఈ సంస్థ ఛైర్మన్ భాస్కర్ రావు 2024 ఎన్నికల్లో భారీ స్థాయిలో ఖర్చు ఉండనుందని చెప్పారు. 'ఈ మొత్తం ఖర్చులో ఎన్నికల సంఘం చేసే వ్యయంతో పాటు ప్రభుత్వాలు, అభ్యర్థులు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఖర్చులు ఉన్నాయి. మొదట ఎన్నికల ఖర్చు రూ. 1.20 లక్ష కోట్లుగా అంచనా వేశాం. కానీ ఇటీవల ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం కావడం, ఎన్నికల సంబంధిత ఖర్చుల్లన్ని లెక్కించడం ద్వారా ఖర్చు అంచనాను రూ. 1.35 లక్షల కోట్లు సవరించామని' భాస్కర్ రావు తెలిపారు. ఎన్నికల తేదీల ప్రకటనకు 3-4 నెలల ముందు నుంచి చేసిన ఖర్చులు ఇందులో ఉంటాయన్నారు. ఎన్నికల బాండ్ల నుంచి మాత్రమే కాకుండా వివిధ మార్గాల్లో ఖర్చు ఉంటుందన్నారు.

దాదాపు సగం వాటా బీజేపీదే..

ఎన్నికల ముందు నుంచి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చుల్లో బహిరంగ సభలు, రవాణా, వర్కర్లు సహా అనేక రకాల ఖర్చులు ఉంటాయి. మొత్తం అంచనాలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఖర్చు చేసేది 10-15 శాతమే. వివిధ ప్లాట్‌ఫామ్‌లలో మీడియా ప్రచారం కోసం 30 శాతం ఖర్చు ఉంటుంది. ఈ 45 రోజుల ప్రచార సమయంలో జరిగే ఖర్చు కంటే వాస్తవంలో ఇంకా ఎక్కువ ఖర్చు జరుగుతుందని భాస్కర్ రావు వివరించారు. సాధారణంగా ఎన్నికల సంఘం పరిధిలోకి రాకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనేక మార్గాల ద్వారా గెలుపు కోసం ఖర్చు చేస్తుంటాయి. 2019 ఎన్నికల సమయంలో రూ. 60 వేల కోట్ల ఖర్చులో 45 శాతం బీజేపీదే ఉంది. 2024 ఎన్నికల్లో ఇది మరింత పెరుగుతుందని అంచనా.



Next Story

Most Viewed