ఏపీ సర్కారు తీరుపై ఎన్జీటీ ఫైర్.. జైలుకు వెళ్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు..

by  |
National Green Tribunal
X

దిశ, తెలంగాణ బ్యూరో : సందేహాలకు తగినట్లుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ముమ్మరంగా చేయిస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం వ్యాఖ్యానించింది. నిర్మాణపు పనులు వద్దు అని, తక్షణం ఆపివేయాలని గతంలో చెప్పినా పట్టించుకోలేదనే అభిప్రాయం ఇప్పుడు తాజా ఫొటోలను చూస్తే అర్థమవుతున్నదని అభిప్రాయపడింది.

ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా ఈ నివేదికను, అందులోని ఫోటోలను చూస్తుంటే స్పష్టమవుతున్నదని వ్యాఖ్యానించింది. కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిబంధనలకు విరుద్దంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే తీరులో ఏపీ ప్రభుత్వం చేపట్టిందని దాఖలైన పిటిషన్‌ను సోమవారం విచారించిన గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ సోమవారం పై వ్యాఖ్యలు చేసింది.

కృష్ణా నది యాజమాన్య బోర్డు సమర్పించిన నివేదిక, అందులోని ఫోటోలను చూస్తే ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు భారీ స్థాయిలోనే జరిగినట్లు స్పష్టమవుతున్నదని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫొటోలు కూడా దానికి బలం చేకూర్చినట్లుగానే ఉన్నాయని వ్యాఖ్యనించింది. ఈ వ్యాఖ్యల సందర్భంలో ఏపీ తరఫున హాజరైన న్యాయవాది జోక్యం చేసుకుని, ఆగస్టు 7వ తేదీ నాటికే పనులను నిలిపివేశామని పేర్కొన్నారు. ఆ తరువాత ఎటువంటి పనులూ చేయలేదని పేర్కొన్నారు.

ఈ విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదిని ఉద్దేశిస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్, కేంద్ర పర్యావరణశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యిందా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇంతవరకూ కేంద్ర పర్యావరణ శాఖ ఎందుకు నివేదికను దాఖలు చేయలేదని ప్రశ్నించింది.

తెలంగాణ పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని, కృష్ణా నది యాజమాన్య బోర్డు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్పించిన నివేదికలో ఫోటోలను చూసిన తర్వాత భారీ స్థాయిలో పనులు జరిగినట్లు స్పష్టమవుతున్నదని, పైగా ఏపీ తరఫు న్యాయవాది కూడా ఆగస్టు 7వ తేదీ వరకు పనులు జరిగినట్లు వెల్లడించారని, ఇదంతా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని బెంచ్‌కు వివరించారు. ధిక్కరణకు పాల్పడితే ప్రధాన కార్యదర్శిని జైల్లో పెట్టాల్సి ఉంటుందంటూ గత విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను బెంచ్‌కు గుర్తుచేశారు.

ఈ వ్యాఖ్యల సందర్భంలో బెంచ్ జోక్యం చేసుకుని, కోర్టు ధిక్కరణకు పాల్పడితే నిబంధనల ప్రకారం అధికారులను ఎన్జీటీ ఇప్పటి వరకు శిక్షించిన సందర్భాలు ఎదురుకాలేదని వ్యాఖ్యానించింది. గతంలో ఎన్నడైనా అధికారులను ఎన్జీటీ జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయా అని పిటిషనర్లను బెంచ్ ప్రశ్నించింది. అలాంటివి గమనంలో ఉన్నట్లయితే వివరించాలని సూచించింది. ధిక్కరణకు పాల్పడినప్పుడు సంబంధిత అధికారులను జైలుకు పంపించే అధికారం ఎన్జీటీకి ఉన్నదో లేదో స్పష్టం కావాల్సి ఉన్నదని, లేదంటే హైకోర్టు ద్వారా మాత్రమే అది జరగాల్సి ఉంటుందా అనే అభిప్రాయాన్ని తెలియజేయాలని పిటిషనర్‌కు సూచించింది. నివేదికను ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టలేదని కేఆర్ఎంబీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నదీ ఆ రోజు జరిగే విచారణ సందర్భంగా వెల్లడిస్తామని పేర్కొన్నది.


Next Story

Most Viewed