అక్కడి మట్టి కోసం ‘నాసా’ ఒప్పందం

by  |
అక్కడి మట్టి కోసం ‘నాసా’ ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్ : చంద్రుడి ఉపరితలం మీద ఎన్నో పరిశోధనలు చేసిన అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’.. ఇప్పటికీ కొత్త కొత్త పరిశోధనలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అక్కడి ‘మట్టి, శిలలు’ కొనుగోలు చేసేందుకు నాలుగు కంపెనీలతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కాస్మిక్ శాంపిల్స్ విలువెంతంటే?

భవిష్యత్తులో చంద్రుడి మీద నుంచి మట్టిని, రాళ్లను సేకరించి, వాటిపై పరిశోధనలు చేయడానికి నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే అక్కడి మట్టి, రాళ్లను తీసుకురావడానికి లునార్‌ అవుట్‌పోస్ట్‌ ఆఫ్‌ గోలెడ్న్‌ (కొలరాడో)తో ఒక్క డాలర్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాటు టోక్యోకు చెందిన ఇస్పేస్‌తో 5,000 డాలర్లకు, ఐస్పేస్ (యూరప్‌, లక్సెంబర్గ్)తో మరో 5 వేల డాలర్లకు, కాలిఫోర్నియాలోని మోజావే మాస్టెన్ స్పేస్ సిస్టమ్స్‌తో 15,000 డాలర్లకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2022-23 సంవత్సరాల్లో ఈ కంపెనీలు చంద్ర మట్టిని నాసాకు అప్పగించనున్నాయి. కాగా చంద్రుడి మీదున్న మట్టిని ‘రెగోలిత్’ అంటారు.

‘మేము నాలుగు కంపెనీల నుంచి మొత్తం 25,001 డాలర్లకు ‘రెగోలిత్’ కొనుగోలు చేయబోతున్నాం’ అని నాసా కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ డివిజన్ డైరెక్టర్ ఫిల్ మక్అలిస్టర్న్‌ తెలిపారు. ‘చంద్రుడి మీద పరిశోధనలతో పోలిస్తే, మార్స్ మీద ప్రయోగాలు చాలా సవాల్‌తో కూడుకున్నవి. అందువల్ల ఇక్కడ నేర్చుకున్న ప్రయోగ పాఠాలను మార్స్ మీద అప్లయ్ చేయాలి. అంతేకాదు మనం సొంతంగా గాలి, నీరు, ఇంధనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని నాసా యాక్టింగ్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ మైక్ గోల్డ్ తెలిపాడు.

ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా నాసా 2024 నాటికి చంద్రుడి మీదకు వ్యోమగాములను (మేల్, ఫిమేల్) పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ఫలితాల ఆధారంగా అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టాలని భావిస్తోంది.



Next Story

Most Viewed