నాసా ఆధ్వర్యంలో చంద్రుడిపైకి తొలి మహిళ.. ఎప్పుడంటే?

by  |
Nasa aims
X

దిశ, ఫీచర్స్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’.. ఆర్టెమిస్(Artemis) స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంలో భాగంగా 2024 కల్లా చంద్రుడిపైకి మ‌హిళతో పాటు శ్వేత జాతేత‌ర వ్యక్తిని పంపించాల‌ని నిర్ణయించింది. ఈ క్రమంలో చంద్రుడి ద‌క్షిణ ధృవంపై ఆస్ట్రోనాట్లను దింపాల‌ని భావిస్తున్న నాసా.. ఈ మిషన్‌కు గ్రీకు దేవత ‘ఆర్టెమిస్’ పేరు పెట్టింది. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ – వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ప్రభుత్వ నినాదంలో భాగంగా ‘నాసా’ ఈ మిష‌న్ చేప‌డుతుండగా.. తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘అందరికీ సమన్యాయం’ అన్న నినాదం మేరకు మహిళతో పాటు శ్వేత జాతేతర వ్యక్తిని చంద్రుడి ఉపరితలానికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు నాసా అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ జుర్సిక్ అధికారిక ప్రకటన చేశారు. కాగా మూన్‌పైకి మనిషిని తీసుకెళ్లిన యూఎస్ ఫస్ట్ మిషన్ ‘అపోలో’కు కవల సోదరిగా పరిశీలకులు ఈ ‘ఆర్టెమిస్’ను అభివర్ణిస్తున్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ఈ మిష‌న్‌లో పాల్గొనే 18 మంది ఆస్ట్రోనాట్లను ‘నాసా’ ప‌రిచ‌యం చేసింది. ఇందులో 9 మంది మ‌హిళ‌ల‌తోపాటు కొంద‌రు శ్వేత‌జాతేత‌ర వ్యక్తులు కూడా ఉన్నారు. కాగా సదరు మహిళ, శ్వేతజాతేతర వ్యక్తి ఎవరు? అనే విషయం ఇంకా వెల్లడించలేదు. ఇక ఆర్టెమిస్ ఆస్ట్రోనాట్స్ తొలి గ్రూపులో భారత సంతతికి చెందిన రాజాచారి ఉండటం విశేషం.


Next Story

Most Viewed