ప్లాన్ చేసి.. డబ్బు దోచి.. చివరికి !

by  |
ప్లాన్ చేసి.. డబ్బు దోచి.. చివరికి !
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: కరోనా ఎఫెక్ట్‌తో జాబ్ కోల్పోయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌లో పడిన ఓ యువకుడు.. తన ఫ్రెండ్‌ దాచుకున్న నగదును అపహరించిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్‌కు చెందిన ఆవుల నరేశ్‌.. కుషాయిగూడలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదేక్రమంలో హాస్టల్‌లో మరో ముగ్గురు పరిచయం కాగా.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వీరంతా కలిసి కీసర మండలం నాగారం సమీపంలోని సదన్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. నలుగురి దగ్గర తాళం చెవిలు ఉన్నాయి. యోగేశ్వర్‌ అనే యువకుడు తన డబ్బులను రూమ్‌లోనే దాచి పెడతున్నాడు. ఈ విషయం రూమ్‌లోని వారందరికీ తెలుసు.

అయితే.. ఇదేక్రమంలో దురాలోచన చేసిన ఆవుల నరేశ్‌.. యోగేశ్వర్‌ డబ్బును కాజేయాలని ప్లాన్ చేసి.. తన తాళం చెవి కనిపించడం లేదని అందర్నీ నమ్మించి సొంతూరుకు వెళ్లిపోయాడు. మళ్లీ ఈనెల 17న హైదరాబాద్‌కు వచ్చిన నరేశ్.. రూమ్‌ దగ్గరకు వెళ్లి అంతా డ్యూటీకి వెళ్లారని నిర్థారించుకున్నాక రూమ్ తాళం తీసి.. రూ.29.50లక్షలు బ్యాగ్‌లో పెట్టుకొని మళ్లీ తాళం వేసి వెళ్లిపోయాడు. రాత్రి 7.30గంటలకు రూమ్‌కు వచ్చిన యోగేశ్వర్‌కు నగదు కనిపించకపోవడంతో మిత్రులందరికీ ఫోన్ చేశాడు. ఇదేక్రమంలో ఆవుల నరేశ్‌కు సైతం ఫోన్ చేసినా.. తాను హైదరాబాద్‌కు రాలేదని చెప్పాడు. దీంతో పోలీసులకు యోగేశ్వర్‌ ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అయితే డబ్బును ఇంటికి తీసుకెళ్లేందుకు భయపడిన నరేశ్.. నిన్న మొత్తం హైదరాబాద్‌లోనే తిరిగి.. బుధవారం తెల్లవారుజామున 4గంటలకు ఉప్పల్‌కు చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నిజం ఒప్పుకున్న నరేశ్ రూ.29లక్షల నగదును పోలీసులకు అప్పగించాడు.


Next Story