ప్రభుత్వ సంస్కరణల వల్లే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది : మోడీ

by  |
ప్రభుత్వ సంస్కరణల వల్లే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఆర్థికవ్యవస్థ వేగంగా కోలుకుంటోందన్నారు. ఈ సంస్కరణలతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెరిగాయని తెలిపారు. దీంతో భారత ఫారెక్స్ నిల్వలు ఎన్నడూ లేనంతగా పెరిగాయన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న ఆయన.. సంస్థ స్వదేశానికి చెందినది కాకపోయినా వాటి ఉత్పత్తులు భారత్‌లోనే తయారు కావాలనే లక్ష్యంతో ఉన్నామని, ప్రస్తుతం దేశీయంగా 60 యూనికార్న్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయన్నారు.

వీటిలో 21 కంపెనీలు గడిచిన కొన్ని నెలల వ్యవధిలోనే ఈ ఘనతను సాధించినట్టు మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించి ప్రభుత్వం నిర్ణయాలను అమలు పరిచినట్టు ప్రధాని మోది వెల్లడించారు. ప్రభుత్వం ‘బ్రాండ్ ఇండియా’ను పటిష్టం చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించిందని, దానికోసం కార్పొరేట్ల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి తరుణంలో పరిశ్రమలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించారు. అదేవిధంగా, ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన పన్ను సవరణ చట్టాన్ని మోదీ ప్రస్తావించారు. రెట్రోస్పెక్టివ్ పన్ను డిమాండ్‌ను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం గతంలో తీసుకున్న పొరపాటు నిర్ణయాలను సరిదిద్దే ప్రయత్నం చేశామని, దీన్ని ప్రైవేట్ రంగం స్వాగతించినట్టు తెలిపారు.



Next Story

Most Viewed