స్నేహితుని హత్య కేసులో వీడిన మిస్టరీ

by  |
police
X

దిశ, చార్మినార్ : సంచలనం సృష్టించిన పాత నేరస్థుడి హత్య కేసులో మిస్టరీని ఛత్రినాక పోలీసులు ఛేదించారు. ఉమాకాంత్‌ను హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఛత్రినాక పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్​ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ మాజిద్​, ఛత్రినాక ఇన్​స్పెక్టర్​ ఖాదర్​ జిలానిలు పాల్గొని హత్యకేసు వివరాలను వెల్లడించారు. బాలాపూర్‌కు చెందిన అయ్యవారి ఉమాకాంత్ (33) భార్య, ముగ్గురు సంతానం. ఉమాకాంత్‌కు అరుంధతి కాలనీ బ్రిడ్జి రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన అబ్బోజు రవి అలియాస్ గుండు రవి(33) లు మంచి స్నేహితులు.

వీరిద్దరు తరచు మద్యం సేవించేవారు. అపుడపుడు రవిని బెదిరిస్తూ ఉమాకాంత్ ఖర్చులకు డబ్బులను అడిగేవాడు. ఈ నేపధ్యంలోనే ఈనెల 29వ తేదీన మరో మారు చిత్తుగా మద్యం సేవించారు. తాగిన మత్తులో మరోమారు ఉమాకాంత్​, రవి గొడవ పడ్డారు. రవి ఉమాకాంత్‌ను కిందపడేసి మెడపై కాలుతో తొక్కాడు. ఉమాకాంత్​ కదలకపోవడంతో చనిపోయి ఉంటాడని భావించిన రవి, అక్కడి నుంచి ఉడాయించాడు. కాసేపటికే తేరుకున్న ఉమాకాంత్​ రవికి ఫోన్​ చేశాడు. షాక్‌ కు గురయిన రవి చనిపోయాడనుకున్న ఉమాకాంత్​ మళ్లీ ఫోన్​ చేశాడేంటని వెంటనే భయపడి తన స్నేహితుడైన మారేడ్‌పల్లికి చెందిన ఎడ్ల వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లాడు.

రవి, వెంకటేశ్వర్లు కలిసి అర్థరాత్రి రాజీవ్​గాంధీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ ఉమాకాంత్‌ను కత్తెరతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛత్రినాక పోలీసులు, అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేసి రిమాండ్‌కు తరలించారు. ఉమాకాంత్​ హత్య కేసులో స్వల్ప వ్యవధిలో మిస్టరీని ఛేదించిన ఛత్రినాక ఇన్‌స్పెక్టర్​ ఖాదర్​ జిలానితో పాటు పోలీసు సిబ్బందిని ఫలక్‌నుమా ఏసీపీ మాజిద్​ ప్రశంసించారు.



Next Story

Most Viewed