కమీషన్ ఇస్తేనే.. ఉద్యోగం!

by  |
కమీషన్ ఇస్తేనే.. ఉద్యోగం!
X

దిశ, కుత్బుల్లాపూర్: తెల్లవారక ముందే రోడ్లను ఊడ్చి, చెత్తాచెదారాన్ని క్లీన్ చేసి రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతారు పారిశుధ్య కార్మికులు. అర్ధరాత్రి నుంచే వారి విధులు మొదలవుతాయి. వారే లేకపోతే ఎక్కడి చెత్త అక్కడే కుప్పులుగా పేరుకుపోతుంది. జనం రోగాలభారిన పడతారు. అటువంటి పారిశుధ్య కార్మికుల కష్టార్జితాన్ని కాజేస్తున్నారు కొందరు అవితి అధికారులు. ప్రతి కార్మికుడి నుంచి నెలకు రూ.500 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితిలో సెలవు పెడితే అంతే సంగతి ఒక సెలవుకు రూ.వెయ్యి ముట్టజెప్పాల్సిందే. లేక పోతే ఉద్యోగం నుంచి తీసేస్తామనే బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో కార్మికులు ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే ఆవేదన చెందుతున్నారు.

ఐదొందలిస్తేనే ఉద్యోగం…

కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో రంగారెడ్డినగర్, సుభాశ్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్ లు ఉన్నాయి. ఈ నాలుగు డివిజన్లలో సుమారు 350మంది వరకు పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తుంటారు. వీరిని సూపర్ వైజ్ చేయడానికి 22మంది శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు సూపర్ వైజర్లుండగా వీరందరికి ఇన్ చార్జి అధికారిగా డీఈ ఉంటారు. అయితే వీరికి ప్రతి నెల వేతనాలు సమయానికి రాకపోగా, వచ్చినప్పుడు మాత్రం అధికారులకు కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం వచ్చిన ప్రతి నెల ఎస్ఎఫ్ఏ కు రూ.500 నుంచి రూ.1000 ఇవ్వాల్సిందే. పనులున్న సమయంలో సెలవు పెడితే అంతే.. సరిగా డ్యూటీకి రావడం లేదని, ఉద్యోగం తీయిస్తానని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్క కుత్బుల్లాపూర్ సర్కిల్ లోనే నెలకు కార్మికుల కష్టాన్ని జెనిగల్లా పీల్చుకుతింటున్నారు. 350లో 300మంది సక్రమంగా విధులకు హాజరైనా ఒకొక్కరి వద్ద రూ.500 చొప్పున రూ.1.50లక్షలు, మిగతా 50మంది సెలవుల్లో ఉంటే ఒకొక్కరి నుంచి రూ.1000 చొప్పును రూ.50వేలు చెల్లించాల్సిందే. ఇలా నెలకు రూ.2 లక్షల వరకు కార్మికుల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

పీఎఫ్ డబ్బూ వదలట్లే…

కార్మికులు అవసరమైన సమయంలో ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) కు దరఖాస్తు చేసుకుంటారు. ఇక్కడ కూడా ఎస్ఎఫ్ఏలు వదలడం లేదని సమాచారం. దరఖాస్తు చేసుకున్నసమయంలోనే రూ.50వేలకు రూ.10వేలు ఇవ్వాల్సిందే. లేదంటే అంతే సంగతులు. ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ నేటికీ పీఎఫ్ డబ్బు రాలేదని ఓ కార్మికురాలు కన్నీరుమున్నీరైంది. ఇదిలా ఉండగా కార్మికులకు ప్రభుత్వం మెడికల్ కిట్లను అందజేస్తుంది. చివరకు మెడికల్ కిట్లను ఇచ్చేందుకు సైతం ఒకొక్కరి వద్ద రూ.3వేలు వసూలు చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. అంతేగాక వారు చెప్పింది చేయాలి, అన్నింటికీ సహకరించాలని వేధిస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. ఇటీవల ఎస్ఎఫ్ఏ లు డబ్బు ఇవ్వాలని అడిగితే ఓ కార్మికుడు జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో, మరో కార్మికుడు పది రోజుల క్రితం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరకాలనీలో గొడవకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం.

డబ్బు ఇవ్వకుంటే ఆబ్సెంట్…

ప్రతి మూడు నెలలకోసారి వచ్చే అలవెన్స్ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇటీవల అధికారులు 6 నూనె డబ్బాలు, 12 సబ్బులు ఇస్తే చేతికి చేరింది మాత్రం ఒక నూనెడబ్బా, ఒక సబ్బు మాత్రమే. మాస్కులు, గ్లౌజులు ఇవ్వడం లేదు. జీతాలు పడిన సమయంలో అడిగిన డబ్బు ఇవ్వకంటే డిజిటల్ లో సంతకం చేయించుకోకుండా ఆప్ సెంట్ వేస్తామని బెదిరిస్తున్నారని కార్మికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

పైఅధికారుల సంగతేంటీ..?

అయితే పారిశుధ్య కార్మికుల నుంచి డబ్బు వసూలు చేసి పైఅధికారులకు ఇవ్వాలి అని చెప్తున్నట్లు తెలుస్తోంది. కార్మికుల కడుపుకోట్టి కిందిస్థాయి అధికారులే తింటున్నారా..? లేక తిలా పాపం తలా కొంచెం అన్నచందంగా ఎస్ఎఫ్ఏలు, సూపర్ వైజర్లు, ఇన్ చార్జి అధికారులు సైతం పంచుకుంటున్నారా..? అనేది సందేహం.

వారిపై చర్యలు తీసుకుంటాం

ఈ విషయంపై డీఈ, ఇన్ చార్జి అధికారి భానుప్రసాద్ ను వివరణ కోరగా డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు తన దృష్టికి రాలేదని చెప్పారు. కార్మికుల నుంచి డబ్బు తీసుకుంటున్న వారెవరైనే ఉంటే చెప్పాలని, వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. భయపడకుండా ఫిర్యాదు చేయండి.. జీతాలు నేరుగా కార్మికుల ఖాతాల్లోనే పడుతున్నాయి. ఎవరైనా డబ్బు కావాలని అడిగితే ఇవ్వొద్దు. వేధింపులకు గురి చేస్తే భయపడకుండా నేరుగా మాకు ఫిర్యాదు చేయండి. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
– మమత, జోనల్ కమిషనర్, కూకట్ పల్లి



Next Story