‘మే’లో ‘పుర’పోరు.. అప్పటివరకు ‘ప్రత్యేక’పాలనే?

by  |
‘మే’లో ‘పుర’పోరు.. అప్పటివరకు ‘ప్రత్యేక’పాలనే?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ఏడు పురపాలికలు, నగర పాలికలకు ‘ప్రత్యేక’ పాలన తప్పేలా లేదు. ఇప్పటికే మూడు మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల చేతులలోకి వెళ్లాయి. ఇంకా రెండు కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు వచ్చేనెలలో ముగిసిపోతుంది. ముందుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయని తెలుస్తోంది. గ్రేటర్​ హైదరాబాద్​ మిగిల్చిన రాజకీయ విషాదం నుంచి ఇంకా అధికార పార్టీ తేరుకోవడం లేదు. వరంగల్​–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీకి వ్యతిరేకత బయట పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యంగా ఈ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వార్డుల తుది జాబితా రూప కల్సన , రిజర్వేషన్ల ప్రక్రియలో జాప్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పురపాలికలకు ప్రత్యేకాధికారుల పాలన తప్పదని స్పష్టమవుతోంది.

ఒకేసారి అన్నింటికీ..

పురపాలికల ఎన్నికల కోసం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గడువు మీరిన వాటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఒకేదఫా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్‌కర్నూల్‌ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు 2021 మార్చి 14తో ముగియనుండగా, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్‌ 15తో తీరనుంది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా ఎదిగిన నకిరేకల్‌ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్‌నగర్‌ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)కు ఎన్నికలు నిర్వహించలేదు. పంచాయతీల పదవీకాలం పూర్తి అయింది.

మున్సిపల్‌ చట్టం ప్రకారం పాలకవర్గాల గడువు ముగింపునకు మూడు నెలల ముందు నుంచే తదుపరి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. గ్రేటర్‌ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడంతో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లను చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలలోనూ ఈ కసరత్తు జరగాల్సి ఉంది. జనవరి 15న ఎన్నికల కమిషన్​ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాను ప్రకటించింది. దీని ఆధారంగానే పురపాలికలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ఈ నెలలోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. . నాగార్జున సాగర్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిసిన తర్వాతే మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు పనుల జోరు..

అధికార పార్టీ కీలకంగా తీసుకుంటున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో ముందస్తుగానే తాయిలాలు ఇస్తోంది. అఖరు సమయంలో వందల కోట్ల విలవైన పనులను చేపడుతున్నారు. ఎన్నికలకు ముందు అభివృద్ధి పనులతో పాటుగా అక్కడి నేతలకు కూడా ఆర్థికంగా కలిసి వచ్చే పనులు చేస్తున్నారు. కార్పొరేషన్లలో మెజార్టీ పనులన్నీ కార్పొరేటర్ల చేతులతోనే జరుగుతున్నాయి. వచ్చేది ఎన్నికల సమయం కావడంతో వారు కూడా పోటీపడ్డారు. చాలా పనులను పంచుకుని చేస్తున్నారు. చివరి సమయం కావడంతో అధికారులు కూడా సహాకరిస్తున్నారు.

పురపాలిక గడువు..

నకిరేకల్​ 2020, డిసెంబర్​ 15
జడ్చర్ల 2020, డిసెంబర్​ 15
కొత్తూరు 2020, అక్టోబర్​ 29
గ్రేటర్​ వరంగల్​ 2021, మార్చి 14
ఖమ్మం 2021, మార్చి 14
అచ్చంపేట 2021, మార్చి 14
సిద్ధిపేట 2021, ఏప్రిల్​ 15



Next Story

Most Viewed