కొనసాగుతున్న పోలింగ్.. ఇప్పటివరకు 33.85 శాతం నమోదు

by  |
Municipal election polling
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలతో పాటు ఖాళీగా ఉన్న మరికొన్ని మున్సిపల్‌ వార్డులలో పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. కరోనా రాష్ట్రంలో విజృంభిస్తుండటంతో కరోనా కట్టడి నిబంధనల మేరకు ఎన్నికల ఏర్పాట్లు చేశారు. మాస్కు లేకుంటే పోలింగ్ కేంద్రాలకు రానీయడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం ఉదయం 11 గంటల వరకు 33.85 శాతం పోలింగ్​ జరిగింది.

ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. ఇందులో 5,57,759 మంది పురుషులు, 5,76,037 మంది మహిళలు ఉన్నారు. మున్సిపల్‌, కార్పొరేషన్ ఎన్నికల మొత్తం 1,539 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల పరిధిలోని 248 వార్డులకు గాను 1,307 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మే 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

ఉదయం 9 గంటల వరకు 13.37 శాతం పోలింగ్​ జరుగ్గా.. 11 గంటల వరకు 33.85 శాతానికి పెరిగింది. గ్రేటర్ వరంగల్‌లో 11 శాతం, ఖమ్మంలో 15.23 శాతం, సిద్ధిపేటలో 13.3 శాతం, అచ్చంపేటలో 11, జడ్చర్లలో 12, కొత్తూరులో 19.22, నకిరేకల్​ మున్సిపాలిటీలో 11.83 శాతం పోలింగ్​ జరిగింది. ఇక 11 గంటల వరకు పోలింగ్​పెరిగింది. గ్రేటర్​ వరంగల్‌లో 23.62 శాతం, ఖమ్మంలో 23.41 శాతం, సిద్ధిపేటలో 31.39 శాతం, అచ్చంపేట్​లో 34 శాతం, జడ్చర్లలో 35 శాతం, కొత్తూరులో 43.99 శాతం, నకిరేకల్​లో 45.55 శాతం పోలింగ్​ జరిగింది.

అదే విధంగా ఉప ఎన్నికలు జరుగుతున్న బోధన్​మున్సిపాలిటీ 18వార్డులో 47.53 శాతం, నల్గొండ 26వార్డులో 31.36 శాతం, గజ్వేల్​ 12వార్డులో 38.44 శాతం, పరకాల 9వ వార్డులో 44.93 శాతం పోలింగ్​ జరిగింది. ఇక గ్రేటర్​ హైదరాబాద్​లోని లింగోజీగూడ 18వ వార్డులో 12.52 శాతం ఓటింగ్​ మాత్రమే జరిగింది. ఇక పోలింగ్​

కేంద్రాల వద్ద డబ్బులు పంచుతూ అధికార పార్టీ నేతలు పట్టుబడ్డారు. వరంగల్‌లోని 2వ డివిజన్‌లోని గుండ్ల సింగారం పోలింగ్​కేంద్ర దగ్గర టీఆర్‌ఎస్ అభ్యర్థి భర్త సింగూలాల్ డబ్బులు పంచుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్‌లో పోలింగ్ రోజును ఓటర్లకు ఒక్కో ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. సిద్దిపేటలోని 24వ వార్డులో రిగ్గింగ్ జరిగిదంటూ గుడ్ల సిద్ధి రాములు అనే ఓటరు ఫిర్యాదు చేశాడు. తన ఓటును ఎవరో వేశారంటూ ఆరోపించారు. మరోవైపు పుర ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలలోని కొండాపూర్ తండా ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచెస్తున్న రమేష్… పుర ఎన్నికల్లో వరంగల్‌లోని 57వ డివిజన్ సమ్మయ్య నగర్‌లో పోలింగ్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు.

ఓటేసిన ప్రముఖులు

ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్, వరంగల్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్, సిద్దిపేటలో పోలీస్​కమిషనర్ జోయల్​డేవిస్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అచ్చంపేటలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కుటుంబంతో సహా ఓట్లేశారు.


Next Story

Most Viewed