పారిశుధ్య కార్మికులను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి

by  |
పారిశుధ్య కార్మికులను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి
X

– ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ డిమాండ్

దిశ, హైదరాబాద్: నోవెల్కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి సైనికుల్లాగా ప్రత్యక్ష యుద్ధంలో పనిచేస్తున్నపారిశుధ్య కార్మికులను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలోని 135 కోట్ల జనాభాలో దాదాపు కోట్ల మందికి కరోనా రాకుండా నిరంతరం పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నది పారిశుధ్య కార్మికులేనని కొనియాడారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలతో ఆయన వరుసగా జూమ్ క్లౌడ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మాదిగ జర్నలిస్టుల ఫోరం సభ్యులను ఉద్దేశించి బుధవారం ఆయన ప్రసంగించారు.

పారిశుధ్య కార్మికులు లేకుండా మానవ సమాజ మనుగడ కొనసాగలేదన్నారు. పారిశుధ్య విభాగంలో నూటికి 90 శాతం మాదిగలే పనిచేస్తున్నారనీ, మిగతా సామాజిక వర్గాలకు చెందిన వారికి నెలకు రూ.50 వేలు ఇచ్చినా..ఈ విభాగంలో పనిచేసేందుకు సుముఖత చూపరని చెప్పారు. వైద్యులు, పోలీసులకు ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ, పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత లేని దౌర్భాగ్యంలో ఉన్నామన్నారు. గ్రామ పంచాయతీలలో పనిచేసే వారికి ఆయా గ్రామ పంచాయితీ ఆదాయాన్ని బట్టి పారిశుధ్య కార్మికుల వేతనాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచన చేసి, పారిశుధ్య కార్మికులను నాల్గో తరగతి ఉద్యోగులుగా పరిగణించాలని కోరారు. రోజూ సైంటిస్టులు, మేధావులు, వైద్యులు, అధికారులు, రాజకీయ నాయకులతో మాట్లాడుతూ ప్రజలకు వార్తలను అందించడంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది అగ్రభాగాన ఉంటున్నారని కొనియాడారు. జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

‘వాళ్లే..’ స్వచ్ఛభారత్ అంబాసిడర్లు..

రోడ్లు, వీధుల వెంట రసాయనాలు పిచికారి చేస్తూ వైరస్ వ్యాపించకుండా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారని అమెరికా సైంటిస్టులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ నినాదంతో ప్రధాని మోడీ పార పట్టినా.. పారిశుధ్య కార్మికులే అసలైన స్వచ్ఛ భారత్‌కు అంబాసిడర్లని చెప్పారు.
పారిశుధ్య కార్మికులను కాపాడుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వారికి సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. కరోనా మహమ్మారి అని ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థనే చెప్పిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. మనుషుల్లో పెరుగుతున్న స్వార్థం,
మానవులు చేస్తున్న తప్పిదాల కారణంగానే కరోనా వైరస్ వచ్చిందన్నారు. ఈ వైరస్ పుట్టిన వుహాన్ నగరంలో లాక్ డౌన్ 1000 శాతం అమలైందని వివరించారు. అందుకే అక్కడ కంట్రోల్ అయ్యిందన్నారు. మన దేశంలో 5 శాతం మినహా మిగతా 95 శాతం లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోందని చెప్పారు. అయితే, లాక్ డౌన్ పరిస్థితుల్లో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ సమన్వయకర్త తిప్పారపు లక్ష్మణ్, ఎంజేఎఫ్ జాతీయ కన్వీనర్ దాస్ మాతంగి, రాష్ట్ర అధ్యక్షులు సుంచు అశోక్, జాతీయ నాయకులు రఘునాథ్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, దేవేందర్, వీరేష్ పాల్గొన్నారు.

Tags: mrps leader Mandakrishna madiga, covid 19 effect, lock down, fight, muncipal staff, fourth class employee

Next Story