ఎంపీపీ vs ఎమ్మార్వో: ప్రభుత్వ భూమిపై నో క్లారిటీ!

by  |
MPP vs MRO
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు స్థానిక ఎమ్మార్వో సమాధానం చెప్పకుండా సమావేశం నుంచి వెళ్లిపోవడం మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవలే మణగూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఆధ్వర్యంలో జరిగింది. అయితే, ఈ సర్వసభ్య సమావేశంలో అసలేం జరిగి ఉంటుందనేది ఇప్పుడు మండలంలో ఉత్కంఠభరితంగా మారింది. ఈ సమావేశంలో ఎంపీపీ కారం విజయకుమారి స్థానిక ఎమ్మార్వోను ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నే ఇప్పుడు మండలంలో పెద్ద చర్చకు దారి తీసింది. మండలంలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది అని ఎమ్మార్వోను ఎంపీపీ ప్రశ్నించింది. దీంతో ఎమ్మార్వో సమాధానం ఇవ్వకుండానే సమావేశం నుంచి వెళ్లిపోయారు. సమాధానం ఇవ్వకుండా ఎమ్మార్వో వెళ్లిపోవడంలో ఆంతర్యమేంటని, వీరి మధ్య విభేదాలు ఉన్నాయా అని విస్తృత చర్చ నడుస్తోంది.

మండలంలో ప్రభుత్వ భూమి లేదా ఉంటే చెప్పడానికి సందేహం ఎందుకు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు మండలంలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాలకు గురువుతున్నాయనే ఉద్దేశ్యంతోనే ఎమ్మార్వోని ఎంపీపీ ఆ ప్రశ్న అడిగారని ప్రజల్లో అనుమానం రేకెత్తుతోంది. మండలంలో భారీ అవినీతి జరుగుతోందని, అధికారులు, ప్రజాప్రతినిధులకు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఇంకొంతమంది గుసగుసలాడుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి వాస్తవ పరిస్థితులెంటో ప్రజలకు తెలియజేయాలి, అదేవిధంగా తర్వాత జరిగే సర్వసభ్య సమావేశం సాఫీగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చూడాలి మరీ.. ఈ అంశంపై కలెక్టర్ స్పందిస్తారా లేదా అనేది.

Next Story

Most Viewed