‘టీఆర్ ఎస్ ఎంపీలకు మోడీ అంటే భయం’

by  |
‘టీఆర్ ఎస్ ఎంపీలకు మోడీ అంటే భయం’
X

దిశ, తెలంగాణ బ్యూరో : పెరిగిన నిత్యవసరాల ధరలు, గ్యాస్​, పెట్రోల్​, డీజిల్​ ధరలపై పార్లమెంట్​లో పోరాటం చేసేందుకు టీఆర్​ఎస్​ ఎంపీలు ఎందుకు ముఖం చాటేశారు, ప్రధాని మోడీ అంటే భయపడుతున్నారా… రాజీ పడుతున్నారా అని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్​కు గురువారం బహిరంగ లేఖ రాశారు.

ఈ సందర్భంగా సవాల్​ విసిరారు. టీఆర్​ఎస్​ ఎంపీలు పార్లమెంట్​కు రావడం లేదని, దీనిపై సమాధానం చెప్పాలన్నారు. బీజేపీపై ఏదైనా పోరాటం చేద్దామంటూ టీఆర్​ఎస్​ ఎంపీలు కనిపించకుండా పోతున్నారన్నారు. బీజేపీపై టీఆర్​ఎస్​ చేస్తున్న గల్లీలో మాటలకు, ఢిల్లీలో చేతలకు పొంతన లేదని రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలను వదిలి విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు తెలుపుతున్నామంటూ ప్రకటిస్తున్నారని, దీని వెనుక దురుద్ధేశం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ ఎత్తుగడ వేస్తున్నారని, విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటిపై పోరాటం చేయరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడుతారా అంటూ ప్రశ్నించారు.

టీఆర్​ఎస్​ మోసం సరిహద్దులు దాటుతోందని, ఎంపీలో పార్లమెంట్​లో పోరాటం చేయరని, జంతర్​మంతర్​ దగ్గర దీక్షకు రారని రేవంత్​ దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడు హక్కుల గురించి గొంతు చించుకోవడం, ఎన్నికలయ్యాక వాటిని మర్చిపోవడం టీఆర్​ఎస్​కు అలవాటేనని, టీఆర్​ఎస్​ ఎంపీలు పార్లమెంట్​కు వస్తారా, జంతర్​ మంతర్​ దగ్గర దీక్షలో కూర్చుంటారా స్పష్టం చేయాలని రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు.



Next Story