‘వైన్స్‌లు ఓపెన్‌‌.. 45రోజుల లాక్‌డౌన్ నిర్వీర్యం’

by  |
‘వైన్స్‌లు ఓపెన్‌‌.. 45రోజుల లాక్‌డౌన్ నిర్వీర్యం’
X

దిశ, కరీంనగర్: రాష్ర్టంలో వైన్స్‌షాప్ ఓపెన్ చేయడంతో 45 రోజుల లాక్‌డౌన్ నిర్వీర్యమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. గురువారం రేవంత్ రెడ్డి జగిత్యాలలో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను అవసరమైన విషయాలను పక్కకు పెట్టడంలో కేసీఆర్ నిష్ణాతుడని, ప్రపంచ వ్యాప్తంగా క్వారంటైన్ గురించి తెలిపింది నేనే అని చెప్పుకుంటాడని విమర్శించారు. కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ర్టంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని విమర్శించారు. కరోనా వైరస్ మూలంగా చనిపోయినా రికార్డుల్లో మాత్రం చూపించడం లేదని, ఇందువల్లే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని అన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలు కూడా లక్షల్లో టెస్టులు చేస్తుంటే తెలంగాణాలో మాత్రం వందలు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు విషయంలో ఆంధ్రాకు నీటిని తీసుకపోతుంటే నాకే నీతులు చెప్తారా అన్న రీతిలో కేసీఆర్ గొప్పలకు పోతున్నాడన్నారు. కేసీఆర్ బతికుండగా రైతుబంధు ఇస్తానని, ఇప్పుడు రైతులను నియంత్రింత సాగు చేయాలని కొర్రీల పెడుతున్నాడని ఘాటుగా విమర్శించారు. సీఎం వైఖరి చూస్తుంటే కల్యాణ లక్ష్మీ కావాలంటే నేను చెప్పిన వాళ్లనే పెళ్లి చేసుకోవాలని నిబంధన విధిస్తాడమోనని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రైతుబంధుకు ఎగనామం పట్టడానికే డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పెట్టిన ప్రెస్‌మీట్ నవ్వుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప ప్రజలకు మేలైన ప్రయోజనం గురించి ఏం ఉండదని అన్నారు. రాష్ర్టంలోని జర్నలిస్టులందరికీ రూ.10,000 ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకు కోత వలన రాష్ట్రానికి రూ.7000 వేల కోట్లు మిగిలాయని, కరోనాకు ఖర్చు పెట్టింది కేవలం రూ.1800 కోట్లు మాత్రమేనని రేవంత్ వివరించారు. ఇప్పటివరకూ ఫండ్స్ ఎన్ని వచ్చాయో కూడా లెక్కలు చెప్పడం లేదని, కరోనా వల్ల రాష్ట్రానికి లాభమే జరిగిందన్నారు.

Next Story

Most Viewed