సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాసిన ఎంపీ కోమటిరెడ్డి

by  |
komatireddy
X

దిశ, భువనగిరి: యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు త్వర‌గా మొద‌లు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం వాటాలో రూ. 75 కోట్లు విడుద‌ల చేయాలని శుక్రవారం సీఎం కేసీఆర్‌కు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి లేఖ రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భువ‌న‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఘట్‌కేసర్-రాయిగిరి (యాదాద్రి) విస్తరణకు రైల్వే మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. ప‌లుమార్లు కేంద్ర మంత్రుల‌ను, రైల్వే అధికారుల‌ను క‌లిసి విన్నవించినందుకు ఆమోదం రావ‌డం సంతోషంగా ఉందని హ‌ర్షం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే యాద‌గిరిగుట్టకు రాష్ట్ర రాజ‌ధాని నుంచి ర‌వాణా సౌక‌ర్యం చాలా సుల‌భం అవుతుందని, అలాగే భ‌క్తుల తాకిడి సైతం పెరుగుతుందని వివ‌రించారు. ఇటు భ‌క్తుల‌కు సౌక‌ర్యం, అటు యాదాద్రి అభివృద్ది కావాలంటే ఈ ప్రాజెక్టు చాలా అవ‌శ్యకమన్నారు.ఈ ప్రాజెక్టు మొద‌లు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత చొర‌వ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర స‌ర్కార్ భ‌రించాల్సిన వ్యయాన్ని వెంట‌నే విడుద‌ల చేసి ప‌నులు ప్రారంభించేందుకు రైల్వేశాఖ‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. రైల్వే శాఖ ఆమోదం తెలుపుతున్నట్లు రైల్వే బోర్డు వ‌ర్క్స్ ఏఎం సంజ‌య్ రాస్తోగి నుంచి లేఖను అందుకున్నట్లు ఆయన వివ‌రించారు.

ఇందులో ప్రాజెక్టు స‌వ‌ర‌ణ రూ. 412.26 కోట్ల వ్యయమవుతున్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. ఈ ప్రాజెక్టు సాగాలంటే రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ 1: 2 నిష్పత్తిలో వ్యయం భ‌రించాల్సి ఉంటుందన్నారు. యాదాద్రి అభివృద్దికి ఉప‌యోగ‌ప‌డే ఈ ప్రాజెక్టు మొద‌లు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ. 75 కోట్లను రైల్వే శాఖ‌కు డిపాజిట్ చేయాలని కోరారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు త‌గిన సూచ‌న‌లు చేయాల‌ని సీఎం కేసీఆర్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు.



Next Story

Most Viewed