ఇక యుద్ధమే.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన నిర్ణయం

by  |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, భువనగిరి రూరల్: ఇకపై ప్రజా సమస్యలు తీర్చేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఇకపై తనను రాజకీయాల్లోకి లాగవద్దని కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అంతేగాకుండా.. ఇప్పటి నుంచి రాజకీయపరమైన విషయాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని, దానికి ప్రజలు, జర్నలిస్టులు సహకరించాలని కోరారు. సోమావరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… భువ‌న‌గిరి ఎంపీగా తాను ఎన్నికైన నాటినుంచి తాను అన్ని గ్రామాల్లో ప‌ర్యటించలేద‌ని, క‌రోనా కారణంగా కొద్ది గ్రామాలకు మాత్రమే వెళ్లినట్లు తెలిపారు. ఇకనుంచి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి, అక్కడ తిష్ట వేసిన సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

అలాగే గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయ‌త్నం చేస్తాన‌ని వెల్లడించారు. గ్రామాల్లో చాలా స‌మ‌స్యలు ఉన్నాయ‌ని వాటిని ప‌రిష్కారానికి పూర్తిగా స‌మ‌యం కేటాయిస్తాన‌ని తెలిపారు. అలాగే పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాల మీదే దృష్టి పెట్టాల‌ని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీక్ ఫౌండేష‌న్ ద్వారా వీలైనంత ఎక్కువ‌గా సేవా కార్యక్రమాలు చేప‌డుతాన‌ని తెలిపారు. న‌ల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవ‌రైనా త‌న తలుపు త‌ట్టవ‌చ్చని వెల్లడించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు జాప్యం వ‌ల్ల న‌ల్గొండ జిల్లాలో వేలాది ఎక‌రాలు బీడు వారుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాన‌ని తెలిపారు. అలాగే 90 శాతం పూర్తైన బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు వంద కోట్లు ఖ‌ర్చు చేస్తే పూర్తై వేల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ని వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తాన‌ని తెలిపారు. వీటితో పాటు భువ‌న‌గిరి పార్లమెంట్ ప‌రిధిలోని గంధ‌మ‌ల్ల, బ‌స్వాపురం రిజ‌ర్వాయ‌ర్లు త్వర‌గా అందుబాటులోకి వ‌చ్చేలా స‌ర్కార్‌పై ప్రజ‌ల ప‌క్షాన యుద్ధం చేస్తాన‌ని తెలిపారు.

Next Story

Most Viewed