అతనొక మానవత్వం లేని మృగం : బండి సంజయ్

by  |
అతనొక మానవత్వం లేని మృగం : బండి సంజయ్
X

దిశ, తాండూరు : మానవత్వం లేని మానవ మృగం సీఎం కేసీఆర్ అని, ప్రగతి భవన్ వెనకాల వరదలొచ్చినా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోలేని ముఖ్యమంత్రి అతనేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తాండూరులోని సల్లా గార్డెన్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేవానికి మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ రావుతో కలిసి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన ఘనత కేసీఆర్‌దని, ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఓటు వేయమని అడగడానికి వస్తే గల్లాపట్టి కొలువల సంగతేంటని నిలదీయాలన్నారు.

అబద్ధాలు ఆడడంలో తండ్రీకొడుకులే నెంబర్ వన్ అని విమర్శించారు. గెలిచే స్థానాలు వదిలిపెట్టి, ఓడిపోయే స్థానాల్లో పీవీ నరసింహారావు కూతురును నిలబెట్టారన్నారు. తెలంగాణ తల్లి మూర్ఖుడైన కేసీఆర్ చేతుల్లో బందీ అయ్యిందని, మూర్ఖుని నుంచి ఆ తల్లిని విముక్తి చేయాలన్నారు. 2023 లో గోల్కొండ కిల్లాపై కాషాయ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేధావులైన పట్టభద్రులు, ఉద్యోగులు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి రాంచందర్ రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్ కుమార్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, నాయకులు నాగరం నర్సింహులు, ప్యాట బాల్ రెడ్డి, మనోహర్ రావు, కృష్ణముదిరాజ్, నర్కుల నరేందర్ గౌడ్, బంటారం భద్రేశ్వర్, జగదీశ్ యాదవ్, సందీప్, నరేష్, జైశ్రీరాం అశోక్ తదితరులు ఉన్నారు.


Next Story