కేటీఆర్ అబద్ధాలు మాత్రమే చెబుతాడు : ఎంపీ అర్వింద్

by  |
కేటీఆర్ అబద్ధాలు మాత్రమే చెబుతాడు : ఎంపీ అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి, అందరి రక్షణ కోసం కేంద్రం వ్యాక్సిన్ అందిస్తుంటే, వ్యాక్సిన్‌ను వేస్ట్ చేయడంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్‌గా నిలిచిందని అన్నారు. మంగళవారం ఎంపీ అర్వింద్ ఈ మేరకు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 40 లక్షల డోసులను కేంద్రం పంపిణీ చేస్తే ప్రభుత్వం మాత్రం 11 నుంచి 12 లక్షల మందికి వరకు మాత్రమే వ్యాక్సిన్ వేసిందన్నారు. అది 30 శాతం మాత్రమేనని అన్నారు. వ్యాక్సినేషన్ వెస్టేజ్‌లో 17.8 శాతంతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకోబడే చత్తీస్‌ఘడ్‌లో 71.16 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తే ఇప్పటివరకు రాష్ట్రంలో 68.4 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారన్నారు.

మనకంటే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 1.1 కోట్లు, బీహార్‌లో 1.11 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారన్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడడానికి ప్రధాన కారణం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కొరతేనని అన్నారు. అందుకు ఉదాహరణగా ఉత్తర తెలంగాణకు మెడికల్ హబ్‌గా పరిగణించే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఉదహరించారని వెల్లడించారు. నిజామాబాద్ జీజీహెచ్‌లో 284 మంది వైద్యులకు గాను 121 ఖాళీలు ఉన్నాయని, 283 మంది స్టాఫ్ నర్సులకు గాను 239 ఖాళీలు ఉన్నాయని, 79 శాతం పారామెడికల్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉంటే అడ్మినిస్ట్రేషన్‌లో 70శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తండ్రి బాటలో కేటీఆర్ పయనిస్తూ అబద్ధాలు చెప్పడం మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. ఇజ్రాయిల్‌లో 60 శాతం వ్యాక్సినేషన్, అమెరికాలో 40 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని చెబుతున్న కేటీఆర్‌కు వాటి దేశ జనాభా తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ముప్పావు వంతు కాదన్న విషయాన్ని మరువరాదన్నారు.



Next Story