కరోనా బారినపడిన ప్రజాప్రతినిధులు వీరే..!

by  |
కరోనా బారినపడిన ప్రజాప్రతినిధులు వీరే..!
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే ఇంచుమించు 8 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మూడు నెలల లాక్‌డౌన్ నేపథ్యంలో జీవనోపాథి కోసం బయటకు వెళ్లే ప్రజలను కరోనా వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరగడం ఆగడం లేదు. సాధారణ ప్రజలు సరే.. ఎన్95 మాస్కులు, శానిటైజర్లు, వంటి సౌకర్యాలన్ని విరివిగా వినియోగించే ప్రజాప్రతినిధులను కూడా కరోనా వైరస్ వదలడం లేదు. ఏపీలో 13 మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారంటే ఆశ్చర్యం కలుగక మానదు. వారి వివరాల్లోకి వెళ్తే…

విశాఖపట్టణంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కూడా కరోనా సోకింది. గుంటూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడ్డారు. కిలారి రోశయ్యతో గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆరంభమైంది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్‌కి కరోనా సోకింది. సత్తెనపల్లి వైఎస్సార్సీపీ నేత అంబటిరాంబాబుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కరోనా బారిపడి హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. పలమనేరు ఎమ్మెల్యే ఎన్ వెంకటయ్య గౌడ్ కూడా కరోనా సోకి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. కడప జిల్లా వాసి, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడితే.. కర్నూలుకి చెందిన హఫీజ్ ఖాన్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి, కొడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కూడా కరోనా బాధితుడిగా మిగిలారు. ఏపీలో కరోనా సోకిన తొలి ప్రజాప్రతినిధిగా ఎస్ కోట ఎమ్మెల్యే కే శ్రీనివాసరావు నిలిచారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

వీరిలోమెజారిటీ ఎమ్మెల్యేలకు వారి గన్ మెన్లు, డ్రైవర్ల ద్వారా సోకింది. దీంతో వారంతా 14 రోజుల హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. జిల్లా వైద్యాధికారుల సూచనల మేరకు వారు చికిత్స తీసుకుంటూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వీరిలో శ్రీనివాసరావు, బాబూరావు, డాక్టర్ సుధాకర్, కిలారి రోశయ్య, అంజాద్ బాషా తదితరులు కోలుకుంటున్నారని సమాచారం. రోజా గన్‌మెన్‌కి కరోనా పాజిటివ్ రావడంతో ఆమె కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే వీరంతా వైద్య ఆరోగ్య శాఖ సూచించిన మార్గదర్శకాలు పాటిస్తూ కరోనాకి చికిత్స పొందుతున్నారు.

Next Story

Most Viewed