Nindu Noorella Saavasam 1st September Episode: పిల్లల కడుపు మాడుస్తున్న మనోహరి.. మళ్లీ అమర్‌తో గొడవపడిన భాగమతి!

by Disha Web Desk 19 |
Nindu Noorella Saavasam 1st September Episode: పిల్లల కడుపు మాడుస్తున్న మనోహరి.. మళ్లీ అమర్‌తో గొడవపడిన భాగమతి!
X

దిశ, సినిమా: రోజురోజుకీ ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతున్నజీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం. ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అరుంధతి చనిపోవడంతో కథలో ట్విస్ట్ ఇచ్చిన ఈ సీరియల్ ఈరోజు(సెప్టెంబర్01) ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం..

మేనేజర్ ఫోన్ చేయడంతో ఆర్జేగా తన స్లాట్లో ప్రోగ్రామ్ చేయడానికి ఒప్పుకుంటుంది భాగమతి. అరగంటలో స్టేషన్‌కి వస్తానని చెప్పడంతో ప్రతి పది నిమిషాలకొకసారి భాగీ ప్రోగ్రామ్ ఉందని అనౌన్స్ చెయ్యమని చెబుతాడు మేనేజర్. బేస్ క్యాంప్‌కు బయలుదేరిన అమర్ జీప్లో కూర్చోగానే రేడియో ఆన్ చేస్తాడు రాథోడ్. పది నిమిషాల్లో ఆర్జే భాగమతి ప్రోగ్రామ్ ఉందని అనౌన్స్ చెయ్యడంతో చిరాగ్గా రేడియో ఆపేయబోతాడు అమర్. కానీ అరుంధతికి భాగమతి ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టంఅని నచ్చజెప్పుతాడు రాథోడ్. తన కుటుంబం గొడవలో పడి భాగీని మర్చిపోయానని రేడియో స్టేషన్కి పరిగెడుతుంది అరుంధతి. అప్పుడే భాగీ కరుణతో కలిసి స్టేషన్కి వస్తుంది.

ఆ రోజు కాన్సెప్ట్ టేబుల్ మీద ఉందని, ప్రోగ్రామ్ బాగా చెయ్యమని చెప్పి వెళ్లిపోతాడు మేనేజర్. తన సీట్లో కూర్చున్న భాగీ ఆరోజు టాపిక్ తాళి అని చూడగానే ఆలోచనలో పడుతుంది. తన పర్సులో ఉన్న తాళి తీసి చేతిలో పట్టుకుని ప్రేక్షకులను పలకరిస్తుంది. తన అభిమానులు తాళి గురించి పంచుకున్న సంగతులు విన్న భాగి అరుంధతి తాళిని తాకట్టు పెట్టాలనే నిర్ణయం మార్చుకుంటుంది. మరి డబ్బులెలా అని కరుణ అంటుండగానే మేనేజర్ భాగీకి సారీ చెబుతూ డబ్బులు ఇచ్చి వెళతాడు. దాంతో సంబరపడిపోతారు కరుణ, భాగీ. లెఫ్టినెంట్ సంతకం కోసం బేస్ క్యాంప్‌కు వచ్చి మళ్లీ అమర్‌తో గొడవపడుతుంది భాగమతి. రాథోడ్ కనపడటంతో కొడైకెనాల్లో తనను కాపాడినందుకు థాంక్స్ చెబుతుంది. కానీ అమరే తను వెతుకుతున్న లెఫ్టినెంట్ అని తెలుసుకోలేకపోతుంది.

తనకు ఎంతో ఇష్టమైన ఆర్జే భాగీని చూడడానికి చిత్రగుప్తుడితో కలిసి రేడియో స్టేషన్కు వస్తుంది అరుంధతి. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అరుంధతి చిలిపితనంతో మాట్లాడే మాటలు సరదాగా ఉంటాయి. అరుంధతి ఆత్మ స్టేషన్లో తిరుగుతుంటే మనసులో ఏదో జరుగుతున్నట్లు ఫీలవుతుంది భాగమతి.

పిల్లలను ఉదయాన్నే లేపి టిఫిన్ కూడా పెట్టకుండా స్కూల్‌కి పంపేస్తుంది మనోహరి. లంచ్ బాక్స్లోనూ వారికి ఇష్టంలేని బెండకాయ కూరపెట్టి వాళ్లు తినకుండా చేస్తుంది. అంతేకాదు స్కూల్లోనూ వాళ్లను పనిష్ చేసేలా ప్లాన్ చేస్తుంది. దాంతో పిల్లలు చాలా ఇబ్బందిపడతారు. సాయంత్రం ఇంటికి వస్తూనే ఢీలా పడిపోతారు. విషయం తెలుసుకున్న అమర్ తల్లిదండ్రులు మనోహరిపై అరుస్తారు. పిల్లలు మాత్రం స్కూల్ బానే ఉందని అమర్‌కు అబద్ధం చెబుతారు. అదే అవకాశంగా చేసుకుని అమర్‌కు దగ్గరవ్వాలని అనుకుంటుంది మనోహరి. స్నేహితురాలని నమ్మిన మనోహరి చేస్తున్న మోసం అరుంధతికి అర్థమవుతుందా? అమర్ మనోహరి ఏడుపుని నమ్ముతాడా? తెలియాలంటే ఈరోజు, సెప్టెంబర్ 01న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

Read More: అవకాశాల కోసం వారితో పడుకోవడానికి ఒప్పుకున్నాను.. నటి షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed