- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెక్కలేనన్ని గంటలు కష్టపడినప్పటికీ ఇలా జరగడం చాలా బాధను కలిగిస్తోంది.. పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్
లెక్కలేనన్ని గంటలు కష్టపడినప్పటికీ ఇలా జరగడం చాలా బాధను కలిగిస్తోంది. సినిమా ఇలా అక్రమంగా ఆన్లైన్లో లీక్ అవ్వడం చూసి షాక్ అయ్యా.

దిశ, సినిమా: దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందే లీక్ అవ్వడం ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనంగా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన పూజా హెగ్డే, ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేస్తూ, పైరసీని ప్రోత్సహించవద్దని ప్రేక్షకులను కోరారు. మూవీ విడుదలకు ముందే లీక్ అవ్వడం తనను ఎంతగానో కలచివేసిందని పూజా పేర్కొన్నారు. "ఒక సినిమా వెనుక వేలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కష్టం, త్యాగాలు ఉంటాయి. ప్రతిరోజూ మీకు ఒక మంచి అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో మేమంతా పని చేస్తాం. లెక్కలేనన్ని గంటలు కష్టపడినప్పటికీ ఇలా జరగడం చాలా బాధను కలిగిస్తోంది. సినిమా ఇలా అక్రమంగా ఆన్లైన్లో లీక్ అవ్వడం చూసి షాక్ అయ్యా. ఇది కేవలం వసూళ్ల గురించి కాదు, ఒక కళాకారుడికి దక్కాల్సిన గౌరవం గురించి," అని ఆమె రాసుకొచ్చారు.
విజయ్ సర్ ఆఖరి చిత్రాన్ని మనమందరం కలిసి థియేటర్లలో పెద్ద తెరపై సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తు చేశారు. "మనం సినిమాను సరైన పద్ధతిలోనే చూద్దాం. పైరసీని ప్రోత్సహించకండి. అప్పుడే మూవీ అనే కళ బతుకుతుంది. కొన్నాళ్ళు వేచి ఉండండి, సినిమా సరైన సమయంలో థియేటర్లలోకి వస్తుంది," అని పూజా హెగ్డే ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. కేవలం పూజా హెగ్డే మాత్రమే కాదు, రజనీకాంత్, చిరంజీవి, సూర్య, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ లీక్ను తీవ్రంగా ఖండించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. సినిమా క్లిప్పులను లేదా పూర్తి చిత్రాన్ని షేర్ చేసే వారిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ డియోల్, మమితా బైజు, ప్రియమణి కీలక పాత్రలో నటించారు. కానీ సెన్సార్ కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది.






