మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. మా కుటుంబానికి ఇది తీరని లోటు అంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ (Meher Ramesh)కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. మా కుటుంబానికి ఇది తీరని లోటు అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను కలచివేస్తున్నాయి. తాజాగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ (Meher Ramesh)కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన అత్తమ్మ పద్మావతి గారు కన్నుమూశారు. ఈ విషయాన్ని మెహర్ రమేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తన అత్తమ్మను తల్లిగా భావించే ఆయన, ఈ లోటును పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు ఆయనకు ధైర్యం చెబుతూ పద్మావతి గారికి సంతాపం ప్రకటిస్తున్నారు.

ఈ సందర్భంగా మెహర్ రమేష్ ఒక ఆసక్తికరమైన, బాధాకరమైన విషయాన్ని పంచుకున్నారు. సరిగ్గా 2003 ఫిబ్రవరి 7వ తేదీన ఆయన కన్నతల్లి వెంకట సుబ్బమ్మ గారు పరమపదించగా, ఇప్పుడు అదే తేదీన (ఫిబ్రవరి 7) తన అత్తమ్మకు ఆఖరి వీడ్కోలు పలకడం విధి వైచిత్రమని ఆయన పేర్కొన్నారు. "ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను.. సరిగ్గా అమ్మ చనిపోయిన తేదీనే అత్తమ్మ కూడా శివైక్యం పొందడం మా కుటుంబానికి తీరని లోటు. ఓం శాంతి" అంటూ ఆయన పెట్టిన పోస్ట్ అందరినీ కలిచివేస్తోంది. మెహర్ రమేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'భోళా శంకర్' వంటి చిత్రాల తర్వాత తన తదుపరి ప్రాజెక్టుల పనుల్లో ఉండగా, ఈ ఘటన ఆయనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Next Story