పవన్ కళ్యాణ్ పోస్ట్‌పై చిన్మయి షాకింగ్ రియాక్షన్.. అసలు చెప్పాల్సిన అవసరం ఏముందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

అసలు ఇంతమంది రాజకీయ నాయకులు ఒక సినిమా పాటల రచయితకు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు.

పవన్ కళ్యాణ్ పోస్ట్‌పై చిన్మయి షాకింగ్ రియాక్షన్.. అసలు చెప్పాల్సిన అవసరం ఏముందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: ప్రముఖ కోలీవుడ్ రచయిత వైరముత్తుకు దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ ప్రకటించడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. ఒకవైపు ఆయన సాహిత్య కృషిని కొనియాడుతూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతుంటే, మరోవైపు ఆయనపై ఉన్న పాత ఆరోపణలను గుర్తు చేస్తూ గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వివాదంలోకి ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు కూడా రావడం చర్చనీయాంశమైంది. వైరముత్తుకు జ్ఞానపీఠ్ రావడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. "తమిళ సాహిత్యంలో వైరముత్తు గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రచనల్లో సామాజిక స్పృహ, మానవత్వపు సున్నితత్వం కనిపిస్తాయి.

ఏడు జాతీయ పురస్కారాలు అందుకున్న ఆయనకు జ్ఞానపీఠ్ దక్కడం విశిష్ట గుర్తింపు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్‌పై చిన్మయి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఆమె స్పందిస్తూ.. "గౌరవంతో చెబుతున్నాను.. పవన్ కళ్యాణ్ గారికి ఆ కవి అసలు స్వరూపం గురించి ఏమీ తెలియదని నాకు ఖచ్చితంగా తెలుసు. సుమారు 17 మంది మహిళలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అటువంటి వ్యక్తికి 'సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం' కోరుకుంటున్నానని ఆయన కార్యాలయం ఆయనకు తెలియజేయాలి.

అసలు ఇంతమంది రాజకీయ నాయకులు ఒక సినిమా పాటల రచయితకు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. 2018లో వచ్చిన 'మీటూ' ఉద్యమ సమయంలో వైరముత్తుపై చిన్మయితో పాటు పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అత్యున్నత పురస్కారం ఆయనకు దక్కడంపై నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు.

Next Story