నగరాన్ని చుట్టేస్తోన్న దోమ.. 100లో 19 ఇళ్లకు డేంజర్!

by  |
Dengue
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా వైరస్ గత రెండేళ్లుగా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంటే… పెరుగుతున్న డెంగీ కేసులు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం లేకపోవడంతో తీవ్రస్థాయిలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 1,184 డెంగీ యాక్టీవ్ కేసులు ఉండగా.. అందులో కేవలం హైదరాబాద్ లోనే 594 కేసులు ఉండటం గమనార్హం. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు అటు ప్రభుత్వాన్ని.. ఇటు ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నాయి. అయితే దీనికి గల కారణాలపై అన్వేషించగా.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చే విషయాలు బయటపడ్డాయి.

రాష్ట్రంలో లార్వా వృద్ధి భయంకర స్థితిలో ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఇటు భారీగా వర్షాలు పడుతుండటంతో నీటి నిల్వలు ఏర్పడి దోమల వృద్ధి పెరుగుతున్నట్లు తెలుసుకున్నారు. అయితే ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం 2018 వరకు డెంగీ లార్వా వృద్ధి రేటు వందలో 16 మాత్రమే ఉండగా.. తాజాగా తీసుకున్న శాంపిల్స్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో 19గా వచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారులు తెలిపారు. ఇది ఆల్ టైమ్ రికార్డు.. అంటే వంద ఇళ్లలోని శాంపిల్స్‌లో 19 ఇళ్లలోని ప్రజలకు డెంగీ పొంచి ఉన్నదని ఆరోగ్యశాఖ నివేదికలో తెలిసింది. దీనిపై అలర్ట్ అయిన అధికారులు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తగిన జాగ్రత్తల ద్వారా డెంగీ నుంచి బయటపడొచ్చని అవగాహన కల్పిస్తున్నారు. అయితే హైదరాబాద్‌తో పాటు మహబూబ్ నగర్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి పట్టణాల్లో కూడా డెంగీ లార్వా వృద్ధి రేటు 10 కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో తేలింది.



Next Story

Most Viewed