కోటి మందికిపైగా అమెరికా పౌరసత్వం

by  |
కోటి మందికిపైగా అమెరికా పౌరసత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రస్తుతం ఆ దేశంలో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉన్న వివిధ దేశాలకు చెందిన కోటి పది లక్షల మందికి పౌరసత్వం ఇవ్వనున్నారు జై బైడెన్. ఇందులో సుమారు ఐదు లక్షల మంది భారతీయులు కూడా ఉన్నారు. దీనికి తోడు ప్రతీ ఏటా కనీసంగా 95 వేల మది శరణార్ధులకు కూడా ఆశ్రయం కల్పించనున్నారు. ఎన్నికల సందర్భంగా బైడెన్ పాలసీ డాక్యుమెంటులో పేర్కొన్న ఈ అంశాలకు తోడు మరికొన్నింటిని కూడా అమలుచేసే దిశగా కార్యాచరణ ఉండనున్నట్లు ఆయన అనుచర వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కాంగ్రెస్‌లో ఒక చట్టాన్ని ఆమోదించి వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తేనున్నట్లు పేర్కొన్నాయి.

ప్రస్తుతం పౌరసత్వం లేని కారణంగా కుటుంబ సభ్యులు ఒక్కో చోట వేర్వేరుగా ఉంటున్నారని, కానీ కుటుంబం మొత్తం ఒకే చోట కలిసి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి వారికి ప్రస్తుతం ఉన్న చట్ట నిబంధనల నుంచి ఉపశమనం కలిగించి పౌరసత్వం ఇవ్వడం ద్వారా సాకారం చేయాలన్నది బైడెన్ లక్ష్యమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కుటుంబ ఆధారిత వలసలను ప్రోత్సహించడం వెనక ఉద్దేశం ఆ కుటుంబాలను ఒక్కటిగా ఉంచాలన్నదేనని నొక్కిచెప్పాయి. కుటుంబ వీసాల మంజూరులో కూడా చాలా బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయని గుర్తించి వాటికి కూడా వీలైనంత తొందరగా మోక్షం కలిగించే నిర్ణయం ఉంటుందని గుర్తుచేశాయి.

కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఒకచోట, వారి పిల్లలు మరోచోట ఉండిపోతున్నారని, ఇందుకు కారణం వీసాల మంజరుతో పాటు పౌరసత్వం ఇవ్వడంలో రూపొందించుకున్న నిబంధనలే కారణమని గుర్తించిన ఆ పాలసీ డాక్యుమెంటు ఇకపైన ఆ కుటుంబాలన్నీ కలిసి ఉండేలా నూతన విధానం (డాకా-డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) అమలులోకి వచ్చేలా ప్రత్యేక మెకానిజం రూపొందనుంది. గరిష్టంగా 1.25 లక్షల మంది శరణార్ధులకు అమెరికాలో వచ్చి ఆశ్రయం పొందేందుకు వీలుగా చట్టంలోనే మార్పులు చేయనున్నట్లు తెలిపాయి.

ఉద్యోగం రీత్యా వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు కలిగినవారు సైతం చట్టపరంగా శాశ్వత నివాసం ఏర్పర్చుకునేలా నూతన విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. నైపుణ్యం కలిగినవారిని దూరం చేసుకోకుండా వారి సేవలను దేశ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమేటిక్స్ తదితర రంగాలకు చెందిన పరిశోధక విద్యార్థు (పీహెచ్‌డీ)లకు కూడా శాశ్వత ప్రాతిపదికన వీసాలను మంజూరు చేసి దేశ సూక్ష్మ ఆర్థిక రంగానికి ఉపయోగపడే విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఈ విధానం ద్వారా లక్షలాది మంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. ముస్లిం మతస్తులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేసే అవకాశం ఉంది. ఇరాన్, సిరియా లాంటి పలు ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారిపై ట్రంప్ ప్రభుత్వం పర్యాటక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బైడెన్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసే అవకాశం ఉంది.



Next Story

Most Viewed