దేశంలో 45వేలు దాటిన మరణాలు

by  |
దేశంలో 45వేలు దాటిన మరణాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఒక్కరోజులో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ వెల్లడించే సరికి గడిచిన 24గంటల్లో ఏకంగా 1007 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో నమోదయ్యే మరణాల సంఖ్య 1000 దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొత్తగా నమోదైన మరణాలతో కలిపి కరోనా బారిన పడి దేశంలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 44,386కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే సాయంత్రానికి వివిధ రాష్ట్రాల కేసుల బులెటిన్‌లు వెలువడడంతో వాటిలోని వివరాల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 45వేలు దాటింది. ఒక్కరోజులో కొత్తగా 62,064 పాజిటివ్ లు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22,15,074కు చేరింది. వీరిలో 15లక్షల 35వేల మంది కోలుకోగా 6లక్షల 30వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజులో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య వరుసగా నాలుగో రోజు 60వేల మార్కు దాటింది.

మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 9,181 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 5,24,513కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో మరణించిన 293 మందితో కలుపుకొని మొత్తం మరణించిన వారి సంఖ్య 18,050కు చేరింది. ఢిల్లీలో 24గంటల్లో కొత్తగా నమోదైన 707 కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,46,134కు చేరింది. ఇక్కడ కొత్తగా 20కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 4131మంది వైరస్ బారిన పడి చనిపోయారు. తమిళనాడులో 24గంటల్లో 5914 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,02,815కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 114 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 5041కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 7665 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,35525కి చేరింది. ఒక్కరోజే 80 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 2116 మంది ప్రాణాలు కోల్పోయారు.


Next Story

Most Viewed