మెగాస్టార్, పవర్‌స్టార్ కంటే నాకే ఫాలోయింగ్ ఎక్కువ : ఎంపీ రఘురామ

by  |
ragurama news
X

దిశ, ఏపీ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కంటే తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. తనకు ఆ పాపులారిటీ ఉండటం వల్లే మీడియా సంస్థలు తనకు మిలియన్ల కొద్దీ యూరోలు ఇచ్చి మరీ తనతో మాట్లాడించుకుంటున్నాయంటూ ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టేందుకు కుట్ర పన్ని ఓ మీడియా సంస్థ నుంచి ఎంపీ రఘురామ మిలియన్ యూరోలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌పై ఎంపీ రఘురామ స్పందించారు. డబ్బుల బదిలీల అలవాటున్నవారు బహుశా యూరోలలో తనకు బదిలీ చేసి ఉంటారని ఎద్దేవా చేశారు. సాధారణంగా అంతా అడిగి మరీ మీడియాలో తమ వార్తలు వేయించుకుంటారని.. కానీ తనకే ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.

వైసీపీ నేతలు ఎందుకు ఇంతలా దిగిజారిపోతున్నారో తనకు అర్థంకావడం లేదని, సీఎం జగన్ ప్రోత్సాహంతోనే ప్రభుత్వం తనపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. అఫిడవిట్‌లో తనపై మోపిన అభియోగాలన్నీ అర్థంపర్థం లేనివన్న ఆర్ఆర్ఆర్ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చాలా నిరాశలో ఉన్నారన్నారు. అందుకే ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రత్యేక హోదా, పోలవరం పేరుతో డ్రామాలాడుతున్నారని ఎంపీ రఘురామ మండిపడ్డారు. తనపై వేటు వేయించేందుకు ప్రయత్నిస్తున్న విజయసాయిరెడ్డి జనసేన తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్‌‌తోపాటు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా కలుపుకున్నారని ప్రశ్నించారు. తనను ఏమన్నా పర్వాలేదని కానీ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోడీని ఏమైనా అంటే బాగోదని ఎంపీ రఘురామ హెచ్చరించారు.

Next Story

Most Viewed